South Korea Plane Crash| దక్షిణ కొరియాలో ఆదివారం డిసెంబర్ 29, 2024 ఉదయం భారీ విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులందరూ దాదాపు మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో మొత్తం 181 మంది ఉండగా.. 179 మంది చనిపోయారని స్థానిక మీడియా యోన్హాప్ మీడియా తెలిపింది. కూలిపోయిన విమానం జూజు ఎయిర్ ఎయిర్ లైన్స్ కు సంబంధించినది. విమానం ఉదయం 9.03 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా ఎయిర్ పోర్ట్ రన్ వే పైనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు నిమిషాల్లోనే వైరల్ అయిపోయాయి.
వివరాల్లోకి వెళితే.. జెజు ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-800 విమానం థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి దక్షిణ కొరియాలోని ముఆన్ ఎయిర్ పోర్ట్ చేరాల్సి ఉంది. విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు, 6 మంది విమాన సిబ్బంది కలిపి 181 మంది ఉన్నారు. వీరిలో 2 మాత్రమే థాయ్ ల్యాండ్ జాతీయులు.. మిగిలిన వారంతా కొరియా పౌరులే. అయితే వైరల్ అవుతున్న వీడియోలో విమానం బెల్లీ ల్యాండింగ్ చేస్తున్నట్లు కనిపించింది. బెల్లీ ల్యాండింగ్ అంటే విమాన చక్రాలు ఎయిర్ పోర్ట్ ల్యాండింగ్ సమయంలో పనిచేయకపోతే.. విమానం నేరుగా దాని బెల్లీ (కడుపు) భాగంపై ఒత్తిడితో రన్ వే పై దిగుతుంది. అలా చేస్తే.. విమానంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. అయినా అత్యవర సమయంలో పైలట్లు అలా రిస్క్ తీసుకొని అలా చేయాల్సి వస్తుంది.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
వైరల్ వీడియో కనిపిస్తున్నట్లు విమానం వెనుక చక్రాలు లేదా ముందు చక్రం ఎయిర్ పోర్ట్ రన్ వే ల్యాండింగ్ సమయంలో పనిచేయలేదు. అంటే ల్యాండింగ్ గేర్లో టెక్నికల్ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఆన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఫైర్ స్టేషన్ చీఫ్ లీ జియోంగ్ హ్యూన్ మాట్లాడుతూ.. విమాన ల్యాండింగ్ సమయంలో వాతావారణం సరిగా లేకపోవడంతో పాటు పక్షుల మందను ఢీకొనడంతో వంటి ఘటనలు జరిగి ఉండవచ్చు. ఇలాంటి ఘటనలు విమాన పైలట్లకు అనూహ్యంగా ఎదురవుతాయి. అలాంటి సమయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం దురదృష్టకరం అని చెప్పారు.
ఎయిర్ పోర్ట్ రన్ వే పై విమానం చాలా వేగంగా ల్యాండింగ్ చేసింది. దీంతో 3 కిలోమీటర్ల పొడవు ఉన్న ముఆన్ రన్ వే పై విమానం బెల్లీ ల్యాండింగ్ చేస్తూ.. రన్ వే నుంచి కాస్త పక్కకు వెళ్లిపోయింది. అక్కడ ఒక గోడ ఉండడంతో దాన్ని ఢీకొంది. ఆ తరువాత వెంటనే విమానం వెనుక భాగం పేలిపోవడం కనిపించింది. ఎయిర్ పోర్ట్ లో ఆ సమయంలో ఉన్నవారంతా పేలుడు శబ్దాలు గట్టిగా వినిపించాయని తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది విమానంలో చెలరేగే మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. అగ్నిమాపక సిబ్బంది విమాన ప్రమాదంలో మృతదేహాల సంఖ్య 179కి చేరినట్లు తెలిపారు. ఇద్దరు సజీవంగా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు విమాన సిబ్బంది కాగా.. మరొకరు ప్రయాణికుడు. ఈ ఇద్దరినీ సమీప ఆస్పత్రికి తరలించామని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
సౌత్ కొరియాలో తక్కువ రేట్లకే విమాన టికెట్లు అందించే జేజు ఎయిర్ 2005లో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే ఇంత భారీ విమాన ప్రమాదం జరగడం జేజు ఎయిర్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంతకుముందు ఆగస్టు 2007లో జేజు ఎయిర్ కు చెందిన బొంబార్డియర్ Q400 అనే విమానంలో 74 ప్రయాణికులుండగా.. రన్ వేపై ల్యాండింగ్ చేస్తూ ప్రమాదానికి గురైంది. కానీ ఎవరూ చనిపోలేదు. కొంతమంది గాయాలయ్యాయి.