![vegetarian city](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/d21edc35b4afc25af7e82f4a881a0808.jpg)
vegetarian city : ఒక కుటుంబంలోనే అందరికీ ఒకే ఆహారపు అలవాట్లు ఉండవు. కొన్ని మతాలకు చెందిన కుటుంబాల్లో పూర్తిగా శాకాహారం ఉంటుంది. అయితే.. అనేక కులమతాల జనం జీవించే ఒక నగరంలో జీవించేవారంతా కేవలం శాకాహారులే అంటే నమ్మగలమా? ప్రపంచం మొత్తంలో అలాంటి అరుదైన రికార్డును సాధించిన ఆ నగరం ఏది? ఎక్కడ ఉంది? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
మనం మాట్లాడుకుంటున్న ఆ శాకాహార నగరం పేరు.. పాలిటానా. ఇది గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది జైనులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రతి జైనుడూ తన జీవితకాలంలో దర్శించవలసిన 5 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటిగా ఉంది.
జైనుల గురువైన ఆదినాథుడు ఒకప్పుడు ఇక్కడ నివసించాడని, ఆయన రోజూ ఇక్కడి పర్వతాలపై నడిచేవాడని జైన గ్రంథాలు చెబుతున్నాయి.
నగర పరిధిలోని పర్వత ప్రాంతంపై ఏకంగా 900 జైన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో రిషభనాథ దేవాలయం, చౌముఖ్ ఆలయం, కుమారపాల, విమలశ, సంప్రతిరాజ దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాల్లోని శిల్పసంపదను గురించి వర్ణించేందుకు మాటలు చాలవు.
ఈ నగరంలో జీవహింస నిషేధం. ఇక్కడ ఎవరైనా జంతువులను చంపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే.. ఇక్కడ గుడ్లు, మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధం. పాలు, పాల ఉత్పత్తులు పుష్కలంగా లభిస్తాయి.
ఈ నగరపరిధిలోని కొండప్రాంతాన్ని ‘శత్రుంజయం’ అంటారు. దీనిపై గల 900 పాలరాతి ఆలయాలను చూడాలంటే.. సుమారు 3950 మెట్లు ఎక్కాలి. 3.5 కి.మీ విస్తీర్ణంలో నిర్మించిన ఆ ఆలయాలు 11వ లేదా 12వ శతాబ్దంలో నిర్మించారు. చరిత్రలో ఈ దేవాలయాలు 16 సార్లు పునర్నిర్మించబడ్డాయి.
తమ నగరానికి ఉన్న చరిత్ర, దీనితో ముడిబడి ఉన్న ధార్మిక విశ్వాసాల కారణంగా ఇక్కడ జంతువధ ఆపాలని గతంలో ఇక్కడ 200 మంది జైన సన్యాసులు ఇక్కడున్న 250 కబేళాలకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. దీంతో 2014లో గుజరాత్ ప్రభుత్వం ఈ నగరంలో జంతువధను నిషేధించింది.
జైనుల విశ్వాసం ప్రకారం, ఈ శత్రుంజయ పర్వతం దేవతల నివాసం. కనుక.. రాత్రివేళల్లో ఈ పర్వతం మీదికి ఎవరినీ వెళ్లేందుకు అనుమతించరు. రాత్రి నిశ్శబ్దంగా ఉండే ఈ పర్వతం ఉదయం తొలి సూర్యకిరణాలు పడగానే.. ఇక్కడ పాలరాతితో నిర్మించిన 900 ఆలయాలన్నీ గొప్ప కాంతితో మెరిసిపోతాయి.