Rapitst Death Sentence Trump| అమెరికాలో హంతకులు, రేపిస్టులకు మరణ శిక్ష కఠినంగా అమలు చేస్తానని.. తాను జనవరి 20న అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక అమెరికా న్యాయ శాఖ (జస్టిస్ డిప్టార్ట్ మెంట్)కు మరణ శిక్ష అమలు చేయమని ఆదేశాలు జారీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఆయన ఓ పోస్ట్ చేశారు.
“నేను అధ్యక్షపదవి చేపట్టిన వెంటనే.. హంతకులు, రేపిస్టులకు మరణ శిక్ష కఠినంగా అమలు చేయమని న్యాయ శాఖకు ఆదేశాలు జారీచేస్తాను. అమెరికా లో ప్రజలు, చిన్నపిల్లలకు భద్రత కల్పించడం కోసం ఇది చాలా అవసరం. హంతుకులు, రేపిస్టులు కృూర మృగాల లాంటి వారు. వారి నుంచి అమెరికన్లకు రక్షణ కల్పించాలి. అమెరికా మళ్లీ శాంతి భద్రతల దేశంగా అవతరించాలి” అని ట్రంప్ మంగళవారం డిసెంబర్ 24, 2024న తన పోస్ట్ లో రాశారు.
అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ.. సోమవారం డిసెంబర్ 23న మరణ శిక్ష కింద జైల్లో ఉన్న 37 మంది ఖైదీలకు ఉపశమనం అందించారు. వారి మరణ శిక్షను రద్దు చేస్తూ.. ఖైదీలకు జీవిత కాలం జైలు శిక్ష విధించారు. మరణ శిక్ష ఖైదీలుగా ఉన్న రేపిస్టులు, హంతకులపై జో బైడెన్ జాలి చూపిస్తున్నారని.. బైడెన్ నిర్ణయాన్ని చాలా మంది అమెరికన్లు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో బైడెన్ వ్యతిరేకి ట్రంప్ కూడా బైడెన్ నిర్ణయాలపై విమర్శలు చేశారు.
Also Read: శాంతా క్లాజ్ ఏ దేశంలో ఉంటాడో తెలుసా?.. సమాధానం దొరికేసింది
ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా మరణ శిక్షల సంప్రదాయాన్ని పున: ప్రారంభించారు. 2016లో ట్రంప్ అధికారంలోకి రాక ముందు అమెరికాలో మరణ శిక్షను 20 సంవత్సరాల పాటు రద్దు చేశారు. ట్రంప్ అధికారం చేపట్టాక 2020 వరకు ఆయన పదవికాలంలో .. 13 మందికి మరణ శిక్ష అమలు చేశారు.
అమెరికాలో మరణ శిక్ష పై 2024లో చేసిన సర్వే ప్రకారం 53 శాతం మంది మరణ శిక్ష విధించాలని సానుకూలంగా స్పందిస్తే.. 43 శాతం ప్రజలు వ్యతిరేకించారు. మరో 7 శాతం స్పందించలేదు. అదే 1994 సర్వేలో 80 శాతం ప్రజలు మరణ శిక్షకు అనుకూలంగా ఉండేవారు. వ్యతిరేకింగా వారు కేవలం 16 శాతం మంది మాత్రమే ఉన్నారు.
మరణ శిక్ష అమలు చేయాల్సిందేనని వాదించే వారు.. హింసాత్మక ఘటనల్లో బాధితులకు న్యాయం కోసం, నేరస్తులు తీవ్రమైన శిక్షల గురించి తెలసుకొని నేరం చేయకుండా భయపడతారని.. అందుకే ఇది తప్పని సరి అని చెబుతున్నారు.
కానీ వ్యతిరేకించే వారు మాత్రం మరణ శిక్షకు గురైన వారిలో ఎక్కువగా నల్లజాతి వారు ఉన్నారని.. అమాయకులను మరణ శిక్ష విధిస్తున్నారని.. వాదిస్తున్నారు. చనిపోయిన తరువాత ఆ వ్యక్తి నిర్దోషి అని తేలితే.. దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీస్తున్నారు.
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారు.. అమెరికన్లను హత్య చేస్తున్నారని.. దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారికి మరణ శిక్ష తప్పకుండా విధించాల్సిందేనని చెప్పారు. కానీ గణాంకాలు చూస్తే.. వలసదారుల కంటే అమెరికా పౌరులే ఎక్కువగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు చేస్తున్నారు.
ఇప్పుడు జో బైడెన్ మరణ శిక్ష రద్దు చేసిన ఖైదీలకు తిరిగి ట్రంప్ మరణ శిక్ష విధిస్తానని చెప్పారు. కానీ అమెరికా చట్టాల ప్రకారం.. అలా కుదరదు. ఒక అధ్యక్షుడు క్షమా భిక్ష పెట్టిన తరువాత మరో అధ్యక్షుడు మరణ శిక్ష విధించడం చెల్లదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేసిన వారికి మాత్రం ఆయన మరణ శిక్ష విధించమని నిర్దేశించవచ్చు.