Ukraine War Modi Trump | అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై మోదీ మాట్లాడారు. ‘‘యుద్ధం విషయంలో భారత్ వైఖరి తటస్థం కాదు. మేం శాంతి వైపు నిలబడతాం. ఇది యుద్ధాల శకం కాదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెప్పాను. ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ తీసుకున్న శాంతి చర్యలకు మద్దతు తెలుపుతున్నాను’’ అని మోదీ తెలిపారు.
భారత్కు ఎఫ్-35 యుద్ధ విమానాలు
అలాగే, సరిహద్దుల్లో చైనాతో ఉన్న ఉద్రిక్తతల మధ్య.. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక కీలక ప్రకటన వెలువడింది. భారత్కు అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాలను అమెరికా విక్రయించడానికి సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ.. ట్రంప్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
‘‘అమెరికా-భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. సమీప భవిష్యత్తులోనే భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ భారత్ మరింతగా కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది నుంచి ఇండియాకు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతాం. ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ట్రంప్ తెలిపారు.
తర్వాత మోదీ మాట్లాడుతూ.. ‘‘ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపై కూడా దృష్టి పెడతాం. 2030 సంవత్సరం నాటికి ఇరు దేశాల మధ్య 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే టార్గెట్’’ అని తెలిపారు.
Also Read: ట్రంప్ క్రిమినల్ మైండ్.. నేరస్తులను భయంకరమైన జైలులో పెట్టాలని ప్లాన్
భారత్ – అమెరికా కలిస్తే మెగా భాగస్వామ్యం : మోదీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్.. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)’ అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. దీని నుంచి స్ఫూర్తి పొందుతూ, తాను కూడా ‘మేక్ ఇండియా గ్రేట్ అగైన్ (MIGA)’ అనే నినాదం ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. MAGA, MIGA రెండూ కలిస్తే ‘మెగా’ భాగస్వామ్యం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మస్క్తో భేటీ
అంతకు ముందు, ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ఎక్స్ సీఈవో, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజె) అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్లో గురువారం ఆయనను కలవడానికి మస్క్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధాని మోదీతో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. అంతరిక్షం, ఏఐ, సాంకేతికత, నవకల్పనలు సహా అనేక అంశాలపై మస్క్తో చర్చించినట్లు మోదీ ‘ఎక్స్’లో తెలియజేశారు. ‘కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ఠ పాలన’ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు.. తీసుకురానున్న సంస్కరణలను ఆయనకు వివరించినట్లు చెప్పారు.
మరోవైపు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) మైఖేల్ వాల్జ్ కూడా మోదీతో సమావేశమయ్యారు. సంబంధిత వివరాలను ప్రధాని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత రంగాలు చాలా కీలకమని వాల్జ్ పేర్కొన్నారు. వాటిపై వాల్జ్తో చర్చలు ఫలప్రదంగా సాగాయని తెలిపారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. వాల్జ్ను భారత్కు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. ఈ భేటీల్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.