US Citizens Shopping Rush| అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న సుంకాల విధానం దేశంలోని అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వ్యాపారవేత్తల నుంచి వినియోగదారులు, రైతుల నుంచి పరిశ్రమల యజమానులు వరకు అందరూ ఈ నిర్ణయాల వల్ల బెంబేలెత్తుతున్నారు. ధరలు పెరుగుతాయని కొందరు ఆందోళన చెందితే.. మరికొందరేమో తమ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారుల ఆందోళన
విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతీకార సుంకాలు పెంచడంతో అమెరికాలో దిగుమతి వస్తువుల ధరలు విపరీతం పెరగతాయనే భయం వినియోగదారుల్లో కనిపిస్తోంది. ఈ భయంతో ప్రజలు దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై డిమాండ్ పెరిగింది. తైవాన్పై 32 శాతం సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనా. దీంతో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలు వంటి ఉత్పత్తులకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. కార్లు, ఇతర గృహోపకరణాలు కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయని తెలుస్తోంది.
టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ ప్రాంంతానికి చెందిన గుటిరెజ్ అనే వ్యక్తి.. సుంకాల ప్రకటన వెలువడిన రోజే 2,400 డాలర్లు వెచ్చించి ల్యాప్టాప్ కొనుగోలు చేశారు. సుంకాలు అమల్లోకి వస్తే అదనంగా 32 శాతం చెల్లించాల్సి వస్తుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కాలిఫోర్నియాలోని సీఈవో లీ వూక్నర్.. ఆడి క్యూ3 లగ్జరీ కారును గత ఆదివారమే కొనుగోలు చేశారు. సుంకాల తరువాత కొంటే అదనంగా 4,300 డాలర్లు చెల్లించాల్సి వచ్చేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.
Also Read: అమెరికాలో ఆర్థిక మాంద్యం ఛాయలు.. అయినా ధీమా వ్యక్తం చేసిన ట్రంప్
వ్యవసాయ రంగంపై ప్రభావం
ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికాలోని వ్యవసాయ రంగంపై కూడా తీవ్రంగా ఉంది. చైనాతో వ్యాపారం చేయడంపై ఉన్న అనిశ్చితితో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా సోయాబీన్, జొన్న ఉత్పత్తులలో 50 శాతం చైనా దిగుమతి చేసుకుంటుంది. వీటితో పాటు మొక్కజొన్న, బీఫ్, చికెన్ వంటి ఉత్పత్తులు కూడా చైనాకు ఎగుమతి అవుతాయి.
గత సంవత్సరం చైనా 24.65 బిలియన్ డాలర్ల విలువ గల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. కానీ చైనా 34 శాతం సుంకాలు విధించడం వల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఫలితంగా డిమాండ్ తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత అమెరికాలో పంటల ధరలు భారీగా తగ్గాయి. మిన్నెసోటా రైతు టిమ్ డఫాల్ట్ ఈ సంవత్సరం సోయాబీన్ ఆదాయం సగానికి తగ్గిపోతుందని వాపోయారు. కొత్త సుంకాలతో అనేక మంది రైతులు వ్యవసాయం వదిలిపెట్టే అవకాశముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర దేశాలకు లాభం
చైనాలో అమెరికా ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో.. వాటికి బదులు బ్రెజిల్, ఇతర దేశాల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. చైనా అమెరికా నుంచి జొన్నలను దిగుమతి చేసుకుని ‘బైజియు’ మద్యం తయారు చేస్తుంది. ఇప్పుడు చైనా ఇతర దేశాలకు ఆర్డర్లు ఇస్తే అమెరికా రైతులకు నష్టమవుతుంది.
రైతులకు ట్రంప్ సాయం చేస్తారా?
గతంలో కూడా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుంకాలను విధించారు. ఆ సమయంలో అమెరికా రైతులు ట్రంప్ నిర్ణయాలను మద్దతు ఇచ్చారు, ఎందుకంటే ఆయన కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించారు. ఈ సారి కూడా అటువంటి సహాయం లభిస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు.
ప్రస్తుతం వ్యవసాయ మంత్రి బ్రూక్ రాలిన్స్ రైతులకు భారీ సాయం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే అవసరమైతే అధ్యక్షుడు ట్రంప్ రైతులకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. మరొవైపు రైతులు ప్రభుత్వ సాయం పై ఆసక్తి చూపించకపోగా, పంటల ద్వారా ఆదాయం పొందాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ చర్చల ద్వారా సుంకాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.