US Illegal Immigrant Route Darien Gap | అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద డీపోర్టేషన్ ఆపరేషన్ చేపట్టి, అక్రమ వలసదారుల్లో భయాన్ని పుట్టిస్తున్నారు. రణార్థులుగా కొందరు, ఉపాధి కోసం మరికొందరు శఅమెరికాలో మెరుగైన జీవితం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వెళ్లేందుకు ఉన్న అక్రమ మార్గాల్లో ఒకటైన ‘డేరియన్ గ్యాప్’ను దాటడమంటే ప్రాణాలతో ఆటాడడమే అని చెప్పవచ్చు.
భయంకరమైన అడవి డేరియన్ గ్యాప్!
కొలంబియా మరియు పనామా సరిహద్దుల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే డేరియన్ గ్యాప్. 60 మైళ్లు (97 కి.మీ) పొడవున ఉన్న ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉన్నాయి. విషపూరిత సర్పాలు, క్రూరమృగాలు, ప్రతికూల వాతావరణం మరియు చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనేది లేదు. ఈ దుర్భేద్యమైన ప్రాంతంలో నేర ముఠాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణా మరియు వలసదారుల దోపిడీకి కేంద్రంగా మారిపోయాయి.
15 రోజులపాటు అడుగడుగునా ప్రమాదాలే
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు మానవ అక్రమ రవాణా ముఠాలు డేరియన్ గ్యాప్ను ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. ఈ ప్రాంతాన్ని దాటడానికి ఏడు నుండి 15 రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా లభించే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి మధ్య అమెరికా దేశాలకు మొదట తీసుకెళ్తారు. అక్కడి నుంచి మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్యం, దాడులు మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా మార్గమధ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలపై ముఠాల అఘాయిత్యాలు ఎక్కువగా ఉంటాయి. ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్లే.
ఏడాదిలో 5.2 లక్షల మంది
కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్ గ్యాప్ను దాటుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 2023లో దాదాపు 5.2 లక్షల మంది ఈ మార్గాన్ని ఉపయోగించినట్లు అంచనా. గత ఏడాది కఠిన చర్యల కారణంగా ఈ సంఖ్య 3 లక్షలకు తగ్గింది. వెనెజువెలా, హైతీ, ఈక్వెడార్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు భారతదేశం నుంచి అక్రమంగా వలస వెళ్లేవారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
అమెరికా కల కోసం ప్రాణాలు బలి
అమెరికా వెళ్లేందుకు డేరియన్ గ్యాప్ మార్గాన్ని లక్షలాది మంది అనుసరిస్తున్నారు. ఈ ప్రక్రియలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం.. 2015-19 మధ్యకాలంలో 312 మంది ఈ మార్గంలో ప్రయాణిస్తూ చనిపోయారు లేదా కనిపించకుండా పోయారు. 2021-23లో ఈ సంఖ్య 229కి పడిపోయింది. 2023లో 676 మంది లైంగిక దాడులకు గురైనట్లు గుర్తించగా, గత ఏడాది ఈ కేసులు 233కి పరిమితమయ్యాయి.
Also Read: ట్రంప్ ఆ పని చేయెద్దు.. హెచ్చరించిన మిత్రులు, శత్రువులు
అమెరికా చేరినా వెన్నంటే దురదృష్టం
మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాదిమంది ఈ మార్గంలో వెళ్తున్నారు. చివరకు మెక్సికో దాటినా, అక్కడ అమెరికా సరిహద్దు దళాల చేతికి చిక్కుతున్నారు. ఇలా అక్రమంగా ప్రవేశించిన వారిని నిర్బంధించి, వారి స్వదేశాలకు తిరిగి పంపే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది. కేవలం కొందరికి మాత్రమే శరణార్థుల స్థితిలో ఆశ్రయం కల్పిస్తుంది.
అమెరికాలో మెరుగైన జీవితం కోసం చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్రమంగా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల, చాలామంది తిరిగి భారతదేశానికి వచ్చేస్తున్నారు. వీరిలో కొందరి కథలు..
సుఖ్జీత్ కౌర్ (26): పంజాబ్ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లింది. అక్కడ అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తితో వివాహం చేసుకుంటే తనకు పౌరసత్వం లభిస్తుందని ఆశపడింది. తనకు కాబోయే భర్త అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో వెళ్లినా, పెళ్లికి కొద్ది నిమిషాల ముందు అరెస్ట్ అయింది. ఇప్పుడు తిరిగి భారత్ చేరింది.
దలీర్ సింగ్: బస్సు డ్రైవర్. రూ. 30 లక్షలు ఖర్చు చేసి అమెరికాకు వెళ్లాడు. కానీ ఇప్పుడు అతన్ని తిరిగి భారత్ పంపుతున్నట్లు తెలిసింది.
అజయ్ దీప్ సింగ్: అమృత్సర్ నుంచి 15 రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడు. కానీ ఇప్పుడు తిరిగి పంపబడ్డ జాబితాలో ఉన్నాడు. అయినా అతని తాత, ఈ విధానాన్ని తప్పు అనడానికి నిరాకరిస్తున్నారు.
అక్షదీప్ సింగ్: అమెరికాలో చదువు కోసం ప్రయత్నించి విఫలమైన తర్వాత, దుబాయ్లో ట్రక్ డ్రైవర్గా పనిచేశాడు. తండ్రి భూమిని తాకట్టు పెట్టి రూ. 50-60 లక్షలు ఖర్చు చేసి అమెరికాకు వెళ్లాడు. కానీ అక్కడికి చేరకుండానే మార్గంలో పట్టుబడి తిరిగి వచ్చేశాడు.
ఈ కథలన్నీ అమెరికాలో మెరుగైన జీవితం కోసం ప్రయత్నిస్తున్న వారి కష్టాలను చూపిస్తున్నాయి. చాలామంది డబ్బులు, ఆశలు కోల్పోయి తిరిగి వస్తున్నారు. అయినా, కొందరు ఇప్పటికీ ఈ మార్గాన్ని సమర్థిస్తుండడం ఆశ్చర్యకరం.