US Universities Immigration| అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరో రెండు నెలల్లో అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన తన రక్షణ మంత్రిత్వశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖతో సహా ఇతర కీలక పదవుల్లో నియమకాలు చేపట్టారు. ముఖ్యంగా ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు, వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బిబిసి రిపోర్ట్ ప్రకారం.. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే పదే వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. ముఖ్యంగా అక్రమ వలసదారులు, సరైన అనుమతి పత్రాలు లేని వారిని వారి దేశాలకు తిరిగిపంపిచేస్తామని అవసరమైతే జైళ్లలో, డిటెన్షన్ సెంటర్లలో పెడతామని.. అవి సరిపోకపోతే డిటెన్షన్ సెంటర్లు సరిపోక పోతే పెద్ద డిటెన్షన్ సెంటర్లు, కౌంటీ జైళ్లు ఉపయోగిస్తామని అన్నారు.
Also Read: ప్రెసిడెంట్ని హత్య చేయిస్తా.. వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు!
అక్రమ వలసదారులపై చర్యలు చేపట్టడానికి మిలిటరీ చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు. ట్రంప్ జనవరి 20, 2025న అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. దీంతో ఆయన అధికారంలోకి రాగానే వలసల చట్టంలో మార్పులు చేసే అవకాశముంది. దీంతో అమెరికాలో వలసదారులు, ముఖ్యంగా విదేశీ విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనలో పడ్డారు.
ముఖ్యంగా గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా.. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రొగ్రామ్ (డిఎసిఎ) చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం.. విదేశాల నుంచి చిన్నతనంలో అమెరికా వచ్చి అక్కడే చదువుకుంటున్న విద్యార్థులుకు వలసల చట్టం నుంచి ఉపశమనం లభించింది. ఇప్పుడు ఒబామా తీసుకువచ్చిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేసే యోచనలో ఉన్నారని బిబిసి రిపోర్ట్. అదే జరిగితే భారత, ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి చదువుకుంటున్న దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కగానే వలసదారులపై ఉక్కుపాదం మోపే విధంగా కొత్త చట్టాలు, పాలసీలు తీసుకువస్తారనే అమెరికాలోని యూనివర్సిటీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అందుకే యూనివర్సిటీ నుంచి సెలవుల పై తమ స్వదేశం, లేదా ఇతర దేశాలకు వెళ్లిన విద్యార్థులు జనవరి 20 కి ముందే అమెరికా చేరుకోవాలని కోరుతున్నాయి. అలా చేయని పక్షంలో అమెరికాలో వారికి వీసా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నవంబర్ 5, 2024న యూనివర్సిటీ ఆఫ్ మసాచుసేట్స్ అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన విద్యార్థుల కోసం సూచనలు జారీచేసింది. అంతర్జాతీయ విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది జనవరి 20 కి ముందు క్యాంపస్ కు తిరిగి రావాలని ప్రకటన జారీ చేసింది. మసాచుసేట్స్ యూనివర్సిటీకి చెందిన ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం.. జనవరి 20న ట్రంప్ అధికారం చేపట్టాక అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఆయన ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేశారు.
Also Read: ట్రాన్స్జెండర్స్ని అమెరికా మిలిటరీ నుంచి తొలగించే యోచనలో ట్రంప్
యూనివర్సిటీ ఆఫ్ మసాచుసేట్స్ తో పాటు మసాచుసేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి), వెస్లెయాన్ యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థులు, సిబ్బందిని తిరిగి రావాలసి అడ్వైజరీ జారీ చేశాయి. యేల్ యూనివర్సిటీలో అయితే అమెరికాలో కొత్త వలస చట్టాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కోబోయే సమస్యలపై వెబినార్ కార్యక్రమం నిర్వహించారు.
2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముస్లిం దేశాలు, ఉత్తర కొరియా, వెనెజ్యూలా లాంటి దేశాలకు ప్రయాణాలపై నిషేధం విధించారు. ఆ తరువాత విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్నందన చైనా విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
జపాన్ కు చెందిన ఆఓయి మయిదా అనే విద్యార్థి ఇండియానా రాష్ట్రంలోని అర్ల్ హామ్ కాలేజీలో చదువుకుంటోంది. అయితే ఆమె ట్రంప్ అధికారంలోకి రాగానే తన వీసా రద్దు చేసి జపాన్ కు తిరిగి పంపిస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేసింది.