India Pakistan War| పాకిస్తాన్, భారత దేశం మధ్య జరుగుతున్న యుద్ధంతో తమకు సంబంధం లేదని.. అమెరికా ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ అన్నారు. “ఈ యుద్ధం మధ్యలో మేము కలుగజేసుకోము, అమెరికా ఈ యుద్ధాన్ని అపేందుకు ఏ విధమైన శక్తిని ప్రయోగించదు. కానీ నేను, ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికా తరపున ఇరు దేశాలను నిలువరించేందుకు మాట్లాడుతున్నాం.” అని వాన్స్ గురువారం ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచదేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జే డీ వాన్స్.. ఫాక్స్ న్యూస్ తో చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”అమెరికా.. ఇరు దేశాలకు అదేశించదు. మీరు ఆయుధాలు వీడండి అని భారతీయులను మేము చెప్పలేం. అలాగే పాకిస్తానీలు కూడా ఆయుధాలు పడేయాలని నేను చెప్పను. అయితే శాంతి స్థాపన కోసం దౌత్య మార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ యుద్ధం పూర్తి స్థాయిలో జరగకూడదనే మేము ఆశిస్తున్నాం. ఇరు దేశాలు అణుశక్తి కలిగి ఉన్నాయి కాబట్టి ఆ దేవుడే వాటి ప్రయోగం జరగకుండా కాపాడాలి. అయితే అలాంటి పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోవడం లేదు.” అని వ్యాఖ్యానించారు.
జమ్ములోని పఠాన్ కోట్ ఇండియన్ మిలిటరీ స్థావరంపై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులు విఫలమైన తరువాత వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్తన్ ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్స్ అన్నీ భారత డిఫెన్స్ సిస్టం నిర్వీర్యం చేసింది.
అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ డినాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం ఆపేందుకు తమ సాయం కోరితే తాను చేయగలిగింది చేస్తానని ఆయన అన్నారు. ఇరు దేశాలు దెబ్బకు దెబ్బ అన్నట్లు దాడులు చేసుకుంటున్నాయని విమర్శించారు. “ఇలా దాడులు జరగడం చాలా ప్రమాదకరం. కానీ నేను ఇరు పక్షాల వైపు నిలబడాల్సిన పరిస్థితి. ఇరు దేశాలతో నాకు మంచి సంబంధాలున్నాయి. అందుకే వారే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నాను. ఇదంతా వారు ఆపేయాలని అనుకుంటున్నా. కూర్చొని మాట్లాడుకుంటే ఇప్పుడే ఈ యుద్ధం ఆగిపోతుంది. కానీ వారు దెబ్బకు దెబ్బ అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. త్వరలోనే ఇదంతా ఆగిపోతుంది.. ఇరు దేశాలతో నేను మాట్లాడుతాను. యుద్దం ఆపేందుకు నా శక్తి మేర సాయం చేస్తాను” అని ఆయన అన్నారు.
Also Read: పంజాబ్ అమృత్సర్లో అర్ధరాత్రి పేలుళ్లు.. 5 నిమిషాల్లో మూడు సార్లు బ్లాస్ట్..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం.. పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాకిస్తాన్ సైన్యం జమ్మూలోని సరిహద్దు గ్రామాల్లో నివసించే సామాన్యులపై విచ్చలవిడిగా బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ దాడులో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. 60 మంది వరకూ గాయాలపాలయ్యారు.
ఇండియా, పాకిస్తాన్.. ఇరు దేశాలు వైమానిక దాడులు చేసుకుండడంతో అమెరికా ప్రభుత్వం సెక్రటరీ, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరు దేశాలతో ఫోన్ ద్వారా చర్చించారు. ముఖ్యంగా పాకిస్తాన్ వెనక్కు తగ్గాలని ఇక దాడులు ఆపేయాలని ఆయన సూచించారు.