Zelenskyy Resignation NATO| రష్యా దండయాత్రకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో శాంతి నెలకొంటే, అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే, ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను “నియంత” అని వ్యాఖ్యానించిన విషయాన్ని స్పష్టంగా ఖండిస్తూ, తాను నియంత కాదని, ఉక్రెయిన్లో ఎన్నికలు జరపడం లేదనే ఆరోపణలను తిరస్కరించారు.
అమెరికా మరియు ఉక్రెయిన్ మధ్య ఖనిజ నిక్షేపాల ఒప్పందం చర్చలపై మాట్లాడుతూ, ఈ ప్రక్రియ ముందుకు సాగుతోందని మరియు సహజ వనరులను పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు జెలెన్స్కీ తెలిపారు. పుతిన్ మళ్లీ ఉక్రెయిన్పై దాడి చేయకుండా నిరోధించగల అమెరికా నేత అవసరం ఉందని ఆయన అన్నారు. యుద్ధం ముగింపు విషయంలో భద్రతా హామీలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు ఉక్రెయిన్కు వస్తున్నారని, ఇది ఒక కీలక మలుపుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధానికి తెరదించేందుకు ఏ చర్చల్లోనైనా తమ భాగస్వామ్యం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
యుద్ధానికి జెలెన్స్కీనే కారణం..
అయితే ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాతో శాంతి చర్చల్లో తమను పిలవదని జెలెన్స్కీ చెప్పడంతో ఆయన మండిపడ్డారు. ప్రెస్ మీట్లో, ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఈ యుద్ధానికి ఉక్రెయినే కారణమని ఆరోపించారు. మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎందుకు ముగించలేదని ప్రశ్నించారు. రష్యా భూభాగాన్ని ఆక్రమించిందన్న ఉక్రెయిన్ వాదనను తిరస్కరించారు. అంత తక్కువ భూభాగం కోసం యుద్ధం చేయడం తప్పు అని.. దాని కోసం పోరాడితే.. ఇప్పుడు ఎక్కువ భూమి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు.
తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నెలాఖరులో పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలని రష్యా కోరుకుంటోందని, ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారని ట్రంప్ అన్నారు. శాంతి చర్చల్లో ఉక్రెయిన్ను పక్కన పెట్టారన్న ఆరోపణలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తిరస్కరించారు. ఉక్రెయిన్, ఐరోపా సమాఖ్యతో కూడా చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.
రష్యా భారీ దాడలు
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ఫిబ్రవరి 24న మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రష్యా సైన్యాలు ఉక్రెయిన్పై భారీ దాడులు చేశాయి. ఉక్రెయిన్ ఆరోపణల ప్రకారం, రష్యా 267 డ్రోన్లను ప్రయోగించింది. ఇది యుద్ధం ప్రారంభించిన తర్వాత ఒకే రోజులో జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి. ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారం, ఈ డ్రోన్లలో సగానికి పైగా నాశనం చేయబడ్డాయి. ప్రాణనష్టం మరియు ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గత వారం రష్యా 1,150 డ్రోన్లు, 1,400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. మరోవైపు, ఉక్రెయిన్ 20 డ్రోన్లను ప్రయోగించిందని.. వాటిని నాశనం చేసినట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది. ఈ మధ్య, రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘డిఫెండర్ ఆఫ్ ది ఫాదర్ల్యాండ్ డే’ సందర్భంగా సైనికుల త్యాగాలను స్మరించుకుని, యుద్ధంలో పోరాడిన సిబ్బందికి పతకాలను ప్రదానం చేశారు.
Also Read: ట్రంప్, మస్క్ లకు మరణ శిక్ష విధించాలి.. గ్రోక్ ఏఐ షాకింగ్ సమాధానం!
2022 ఫిబ్రవరి 24న ‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’ పేరుతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించింది. నాటో విస్తరణను ఆపడం, డాన్బాస్ ప్రాంతాన్ని విమోచించడం మరియు నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలుగా పుతిన్ ప్రకటించారు. మూడేళ్ల యుద్ధంలో ఇరువైపులా లక్షలాదిమంది సైనికులు మరణించారు లేదా గాయపడ్డారు. కోట్ల డాలర్ల మేర ఆస్తినష్టం సంభవించింది. అయితే, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పదవి చేపట్టడంతో ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రైస్తవ మత్త గురువు పోప్ ఫ్రాన్సిస్.. ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శాంతి సందేశం ఇచ్చారు. ఈ యుద్ధాన్ని మానవాళికి బాధాకరమైన సందర్భంగా పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావాన్ని తెలిపారు. పాలస్తీనా, ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యం, మయన్మార్, సూడాన్ వంటి ప్రాంతాల్లో శాంతి కోసం ప్రార్థించాలని పోప్ పిలుపునిచ్చారు.