Ranya Rao Police Custody| బంగారం స్మగ్లింగ్ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారుల కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఫోటోలో ఆమె ముఖంపై గాయాలు.. అంటే కంటి కింద నల్లని చారలు, ఉబికిన చర్మం కనిపిస్తున్నాయి. దీంతో ఆమెపై కస్టడీలో పోలీసులు చిత్ర హింసలు పెట్టరా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కర్ణాటక మహిళా కమిషన్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది, కానీ రన్యారావు నుంచి ఫిర్యాదు రాకపోతే చర్య తీసుకోలేమని తెలిపింది.
ప్రధానంగా వైరల్ అయిన ఫోటోను సూచిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడి చేశారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే ఈ వ్యవహారంలో తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదని ఆమె అన్నారు. రన్యారావు తమకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని నాగలక్ష్మి చెప్పారు.
‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రన్యారావు నుంచి ఫిర్యాదు మాకు అందిన పక్షంలో మా పరిధిలో ఉన్న అన్ని విభాగాలను అప్రమత్తం చేస్తాం. ఆ తరువాత మా పద్ధతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురైందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు.
మరోవైపు.. విదేశాల నుంచి బంగారు కడ్డీలను తరలిస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు తాను అమాయకురాలినని చెప్పుకుంటోంది. తాను ట్రాప్లో పడ్డానని, కావాలని ఇలా అక్రమంగా బంగారు కడ్డీలను తరలించలేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారుల ముందు బోరుమంది.
తాను నేరం చేసినట్లు ఒప్పుకుంటూనే, ఇది తాను కావాల్సి చేసిన పని కాదని అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. తాను దుబాయ్ తో పాటు, అమెరికా, యూరప్, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలను వెళ్లినట్లు పేర్కొంది.
ప్రస్తుతం డీఆర్ఐ విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో రన్యారావుకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికారాలు ముందుగా సీజ్ చేశారు. ఆమె మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లాంటి తదితర వస్తువుల్ని అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆమెకు ఎవరితో లింకులు ఉన్నాయనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 2024 నుంచి ఆమె జరిపిన ఫైనాన్షియల్ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ వెనుక కీలక సూత్రధారి ఎవరు అనే కోణంలో ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది.
రన్యారావు, దుబాయ్ నుంచి 12 కిలోల బంగారం కడ్డీలను అక్రమంగా తరలిస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడింది. ఆమె తాను ట్రాప్లో పడ్డానని, ఇది తన ఇష్టం కాదని DRI అధికారుల ముందు బోరుమన్నారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను DRI సీజ్ చేసింది మరియు ఆమె ఫైనాన్షియల్ వ్యవహారాలను పరిశీలిస్తోంది. ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు సాగుతోంది.
గత సంవత్సరం చెన్నైలో కూడా ఇలాంటి బంగారం స్మగ్లింగ్ కేసు నమోదైంది, దానితో ఈ కేసుకు పోలికలు ఉన్నాయి. రన్యారావు ప్రస్తుతం మూడు రోజుల DRI కస్టడీలో ఉంది మరియు ఈ కేసు వెనుక ఉన్న “కింగ్ పిన్” గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.