HD Deve Gowda Sent Grandson abroad, Claims CM Siddaramaiah: మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ ప్రకటనపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవెగౌడనే రేవణ్ణను విదేశాలకు పంపించారంటూ ఆయన ఆరోపించారు. దేవెగౌడ సూచనలు, సహకారంతోనే రేవణ్ణ జర్మనీ వెళ్లారంటూ ఆయన అన్నారు. అయితే, కేవలం ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకే దేవెగౌడ ఈ ప్రకటన చేశారంటూ సిద్ధరామయ్య అన్నారు. అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకటనపై స్పందించారు. అది పూర్తిగా దేవెగౌడ కుటుంబ అంశమని, అందులో తాను జోక్యం చేసుకోబోనని డీకే శివకుమార్ అన్నారు. అయితే, ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం దర్యాప్తు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ కేసు విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. సిట్ దర్యాప్తుకు సహకరించకుండా ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోవడాన్ని తప్పుబడుతూ దేవెగౌడ గురువారం సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడున్నా దేశానికి వచ్చి పోలీసులకు లొంగిపోవాల్సిందిగా ఆయన హెచ్చరిస్తూ ప్రకటన చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో సిద్ధ రామయ్య, డీకీ శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: వలపు వలతో ఎంపీ హత్య, చర్మాన్ని ఒలిచి.. ముక్కలుగా నరికి..
కాగా, రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన దౌత్య వీసాను రద్దు చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే, రేవణ్ణ పాస్ పోర్టును రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. విదేశాంగ శాఖ రేవణ్ణ పాస్ పోర్టును రద్దు చేస్తే.. ఆయన విదేశాల్లో ఉండడం చట్ట విరుద్ధమవుతుంది. కాగా, ఇప్పటికే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్, బ్లాకార్నార్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా కూడా రేవణ్ణ వెనక్కి రాలేదు.