Israel Indian Workers| అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి తరువాత అక్కడ పాలస్తీనా వాసులపై నిషేధం విధించారు. ముఖ్యంగా గాజాలో నివసించే పాలస్తీనా వాసులపై టెల్ అవీవ్ నగరంలో ప్రవేశించేందుకు ప్రభుత్వం నిషేధించింది. దీంతో గాజా నుంచి వచ్చి లేబర్ పనిచేసేవారిపై కూడా ఈ ఆంక్షలు విధించారు.
అక్టోబర్ 7 హమాస్ దాడులకు ముందు వరకు పాలస్తీనా వాసులు 80,000 మంది ఇజ్రాయెల్ భవన నిర్మాణ కూలీలుగా, ఇతర లేబర్ వర్కర్లుగా ఉద్యోగం చేసేవారు. కానీ గాజా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమైన తరువాత ఇజ్రాయెల్ లో దేశవ్యాప్తంగా పాలస్తీనా వాసులపై నిషేధం విధించడం జరిగింది. ఈ కారణంగా అక్కడ భవన నిర్మాణ పనులు, ఇతర లేబర్ పనులు చేసే వారి కొరత తీవ్రంగా ఉంది. అక్కడ భవన నిర్మాణ రంగం దాదాపు స్థంభించిపోయింది. దీంతో ఆ దేశంలో పనిచేసేందుకు లేబర్, భవన నిర్మాణ కార్మికులు కావాలని ఇండియాలోని జాబ్ కన్సల్టేన్సీలలో కొన్ని నెలల క్రితమ ప్రకటనలు వచ్చాయి.
ఈ ప్రకటనలు చూసి లక్షల మంది ఇజ్రాయెల్ వెళ్లి పనిచేసేందుకు ముందుకువచ్చారు. ఫలితంగా ఇప్పుడు ఇజ్రాయెల్ లో భారతీయులు వేల సంఖ్యలో వలస వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు. సెంట్రల్ ఇజ్రాయల్ లోని బీర్ యాకోవ్ ప్రాంతంలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా ఇండియాకు చెందిన రాజు నిషాద్ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నారు. 35 ఏళ్ల నిషాద్ తన కుటుంబాన్ని పోషించడానికి ఇజ్రాయెల్ వెళ్లాడు. అక్కడ భారత దేశం కంటే మూడు రెట్లు సంపాదన ఉందని తెలిపాడు.
Also Read: భోజనం ఆలస్యమైందని పెళ్లి క్యాన్సిల్.. మరో యువతితో వరుడి వివాహం!
యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లో తరుచూ వైమానిక దాడులు జరిగే సూచనలిస్తుంటారని.. యుద్ధ సైరన్లు మోగినప్పుడు అందరూ పరుగులు తీస్తూ.. సురక్షిత ప్రదేశాల్లో దాగి ఉండాలని చెప్పాడు. కానీ పని ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు యుద్ధ సైరన్లు మోగుతున్నా.. వాటిని లెక్క చేయకుండా తమ పని ముగించాల్సి ఉంటుందని అన్నారు. బీర్ యాకోవ్ లో నిషాద్ పనిచేసే కంపెనీ రోడ్లు, భవనాలు నిర్మిస్తోంది.
గాజా యుద్ధం మొదలైన తరువాత నుంచి ఇప్పటివరకు 16000 మంది భారతీయులు.. ఇజ్రాయెల్ కు వలస వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్లు అధికారిక సమాచారం. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం భారతీయులను మరింత మందిని తీసుకురావాలని యోచిస్తోంది. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికే ఐటి, వైద్య రంగం, డైమండ్ ట్రేడింగ్ లాంటి రంగాల్లో భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు గాజా యుద్ధం కారణంగా లేబర్ ఉద్యోగాల్లో కూడా వెళుతున్నారు. ఇండియాలో రిక్రూటింగ్ ఏజెన్సీ నడుపుతున్న్ సమీర్ ఖోస్లా అనే వ్యక్తి మాట్లాడుతూ.. తమ ఏజెన్సీలో ఇప్పటివరకు 3500 మందికి పైగా భారతీయులను ఇజ్రాయెల్ కు పంపించిందని.. వారంతా చిన్న ఉద్యోగాలు, లేబర్ పనులు చేసేందుకు వెళ్లారని తెలిపారు. ఇజ్రాయెల్ లో లెబర్ కొరత తీవ్రంగా ఉందని ఇంకా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
భారతీయులు ఇజ్రాయెల్ కు వెళుతన్నా.. పాలస్తీనా వాసులు లేని కొరత స్పష్టంగా కనిపిస్తోందని స్థానిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ జనాభా ప్రతి ఏడాది 2 శాతం మేర పెరుగుతోందని.. వారందరికీ ఇళ్లు అవసరమైన నేపథ్యంలో భవన నిర్మాణ రంగంలో లేబర్ కొరత తీవ్రంగా ఉందని సమాచారం.