IndiGo Flight: ఆగస్ట్ 19న ఢిల్లీ నుంచి బయలుదేరిన ఒక ఇండిగో విమానం గోరఖ్పూర్ విమానాశ్రయంలో దిగుతుండగా ఊహించని ఘటన ఎదురైంది. ల్యాండింగ్ సమయంలో విమాన వెనుక భాగం రన్వేను బలంగా తాకింది. విమానయాన భాషలో దీనిని ‘టెయిల్ స్ట్రైక్’ అని పిలుస్తారు. అయితే, పైలట్ల సమయస్ఫూర్తి వల్ల ప్రయాణికులు, విమాన సిబ్బందితో సహా మొత్తం 216 మంది సురక్షితంగా కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
టెయిల్ స్ట్రైక్ అంటే ఏమిటి?
టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ముందు భాగం ఎక్కువగా పైకి లేచి, వెనుక భాగం నేలను తాకడాన్ని టెయిల్ స్ట్రైక్ అంటారు. విమానం దిగేటప్పుడు గాలి వేగంలో మార్పులు లేదా ల్యాండింగ్ కోణం స్వల్పంగా మారినప్పుడు ఇలా జరుగుతుంది. దీని వల్ల విమాన నిర్మాణ భాగానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
క్షుణ్ణంగా విమాన తనిఖీలు
సురక్షిత ల్యాండింగ్ తర్వాత ఇండిగో ఇంజనీర్లు విమానాన్ని పరిశీలించారు. ఎయిర్బస్ విమానం వెనుక భాగంలో, ముఖ్యంగా ‘APU ఇన్లెట్’ ఏరియా వద్ద కొన్ని స్వల్ప గీతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో విమానాన్ని వెంటనే గ్రౌండ్ చేసి, సర్వీస్ నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టారు.
ఇండిగో సంస్థ స్పందన
ప్రయాణికుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని ఇండిగో ప్రకటించింది. విమానానికి సంబంధించిన పూర్తిస్థాయి సాంకేతిక, భద్రతా తనిఖీలు పూర్తయి, సంబంధిత విమానయాన నియంత్రణ అధికారుల (DGCA) క్లియరెన్స్ లభించిన తర్వాతే ఈ విమానాన్ని మళ్లీ రాకపోకల కోసం వినియోగిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఒక పెద్ద ప్రమాదం తృప్తిలో తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
Also Read: సున్నం చెరువు గ్రేట్ మేకోవర్.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం!