Kerala Nurses: కేరళలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుతమైన ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని, గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ఇద్దరు నర్సులు సమయస్ఫూర్తితో స్పందించి కాపాడారు. వారిద్దరు సమయానికి సీపీఆర్ చేయడంతో.. బాధిత వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇదంతా చూసిన స్థానిక ప్రజలు, వాహనదారులు.. ఆ ఇద్దరు నర్సులపై ప్రశంసలు కురిపించారు.
కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఉదయం కలడి వంతెన సమీపంలోని ఎంసీ రోడ్డులో సినోజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి కారులో వెళ్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా ట్రాఫిక్ జామ్ ఉండటంతో కారులోనే కుప్పకూలాడు. దీంతో స్థానికులంతా ఏం జరుగుతుందో అర్థం గాక.. కారు చుట్టూ చేరారు. ఈ క్రమంలో అటుగా KSRTC బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు నర్సులు అంజలి బైజు, ఆర్ధ్ర రాజ్.. పరిస్థితిని గమనించారు.
బస్సు నుంచి దూకి.. వేగంగా కారు వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. కారులోని వ్యక్తి.. గుండె పోటుకు గురైనట్లు గ్రహించి.. అతడికి వెంటనే సీపీఆర్ చేశారు. సమీపంలోని ఆస్పత్రికి వెళ్లేవరకూ సినోజ్ కు సీపీఆర్ కొనసాగించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకెళ్లి.. అతడికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు రక్షించారు. వైద్యులు సినోజ్ గుండెకు సంబంధించి రక్తనాళం ముసుకుపోవడం హార్ట్ అటాక్ వచ్చిందని నిర్ధారించారు. అతడికి యాంజియోప్లాస్టీ చేశామని.. అతడి ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. దీంతో స్థానికులతో పాటు ఇద్దరు నర్సులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: ప్రార్థనా స్థలాలు, పోలీస్ స్టేషన్లే టార్గెట్.. దిల్లీలో రక్తపాతానికి పాక్ భారీ కుట్ర!
అయితే ఆస్పత్రికి చేరుకునేసరికే.. సినోజ్ స్పృహలోకి వచ్చాడని స్థానికులు తెలిపారు. కుప్పకూలిన స్టేజీ నుంచి సాధారణ స్థితిలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇద్దరు నర్సులతో పాటు స్థానికుల సహకారంతో సినోజ్ ప్రాణాలతో బయటపడ్డాడు. సినోజ్ అనారోగ్యానికి గురవ్వడాన్ని గమనించి.. ఓ వ్యక్తి తన కారులో సినోజ్ ను ఆస్పత్రి వరకూ చేర్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మరికొందరు ట్రాఫిక్ లో ఆ కారు ముందుకు వెళ్లే వాహనాలను క్లియర్ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: డేటానే సంపద.. ఐటీతోనే ప్రగతి.. స్వర్ణాంధ్ర విజన్పై చంద్రబాబు మార్క్ స్పీచ్