CM Chandrababu: ప్రజలకు ప్రభుత్వం సేవలు అందించడం ఎంత ముఖ్యమో.. సంపద సృష్టికి ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్పై నిర్వహిస్తోన్న రెండు రోజుల వర్క్ షాప్లో పాల్గొని ఆయన మాట్లాడారు. పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేసే అంశాన్ని వర్క్ షాప్లో ప్రస్తావించిన సీఎం.. తాను స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మల జీవన స్థితిగుతులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలు, డ్వాక్రా రుణాల ద్వారా సదరు కుటుంబానికి జరిగిన మేలుపై వర్క్ షాప్లో వెల్లడించారు.
పేదల స్థితిగతులను మెరుగు పరిచేందుకు జీఎస్డీపీ, సీఏజీఆర్ గణాంకాలను బేరీజు వేసుకుని పాలన చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. తానూ ఆర్థికశాస్త్రం చదివానన్న సీఎం.. సమాజం నుంచి, ప్రజల నుంచి ఎక్కువగా నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రజలే తన గురువులని పరోక్షంగా వ్యాఖ్యానించారు. వర్క్ షాప్కు ఆర్థిక, పరిపాలన వ్యవహరాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న నిపుణులు హాజరుకావడం సంతోషకరమన్నారు. దేశంలోనే తొలిసారి ‘విజన్ – 2020’ రూపొందిస్తే నాడు నన్ను విమర్శించారని గుర్తుచేశారు. దేశానికి కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భావించారని పేర్కొన్నారు.
ప్రస్తుత ఐటీతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఐటీతో అభివృద్ధి సాధించగలమని ఆనాడే తాను బలంగా నమ్మినట్లు స్పష్టం చేశారు. సర్వీస్ సెక్టార్ రివల్యూషన్ ను అందిపుచ్చుకుంటే అభివృద్ధి జరుగుతుందని విశ్వసించినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిన రోజుల్లోకి వచ్చామన్న సీఎం… డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని అంచనా వేశారు. నవ్యాంధ్రప్రదేశ్ లో సంపద సృష్టికి ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు సాధించడం చాలా ముఖ్యమన్నారు. అందుకే ‘స్వర్ణాంధ్ర విజన్’లో ప్రైవేట్ పెట్టుబడులు అనే అంశాన్ని చేర్చామని గుర్తుచేశారు.
Also Read: దొంగలు, చోరీలకు చెక్ పెట్టాలా? వైర్డ్ vs వైర్లెస్.. ఏ CCTV పవర్ఫుల్?
మరోవైపు అన్ని రంగాలకు సంబంధించిన డేటాను సేకరించడమే కాకుండా.. డేటా అనుసంధానం కూడా చాలా ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. డేటా లేక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానమవుతుందని పేర్కొన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. పేద – ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజం నుంచి లబ్ది పొంది ఎదిగిన వారు సమాజానికి కొంతైనా ఇవ్వాలనే ఆలోచన నుంచే పీ4 కార్యక్రమం పుట్టిందని మరోమారు పునరుద్ఘటించారు. ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబాలను ప్రొత్సహించాలన్నది తమ ఆలోచనగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Also Read: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎండకు తట్టుకోలేక.. ఐకియాలోనే మకాం పెట్టేశారు!