Woman With 350 Cats At Home | సాధారణంగా ఎవరైనా జంతు ప్రేమికులు ఒకటి లేదా రెండు మూగ జీవాలను పెంచుకుంటారు. వాటిని అల్లారుముద్దుగా సాకుతుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ తన ఇంట్లో ఏకంగా 350కి పైగా పిల్లులను పెంచుకుంటోంది. వాటిని చూసుకునేందుకు 6 మంది హెల్పర్లను కూడా నియమించింది. కానీ ఆమె చూపించే జంతుప్రేమ ఇతరులకు కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు ఆమెకు అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. ఆమెపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
వివరాల్లోకి వెళితే.. పుణెలోని హడప్సర్ ప్రాంతంలోని మార్వెల్ బౌంటీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ఒక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఒక మహిళ నివసిస్తోంది. ఆమెకు పిల్లులు అంటే చాలా ఇష్టం. దీంతో ఆ ఫ్లాట్లోనే 350కి పైగా పిల్లులను పెంచుకుంటోంది. అయిదు సంవత్సరాలుగా ఆమె తన ఇంట్లో కొన్ని పిల్లులను పెంచుకుంటుండగా.. అవి చాలా తక్కువ సమయంలోనే వందల సంఖ్యలో పిల్లలు కనడంతో క్రమంగా వాటి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వందల సంఖ్యలో పిల్లులున్నా ఆమె మాత్రం వాటిని దూరం చేసుకోలేదు. వాటిని పెంచడానికి క్రమంగా హెల్పర్లు తెచ్చి పెట్టుకుంది. కానీ ఈ పిల్లుల అరుపులు ఆ సొసైటీలోని ఇతర వాసులకు ఇబ్బంది కలిగించాయి. పైగా పిల్లులు విసర్జించే మలం వాటి దుర్వాసన భరించలేకపోతున్నామని ఆమె పొరుగు ఫ్లాట్ లో నివసించే వారు ఆమెకు చెబితే.. వారితో ఆమె గొడవ పడింది. దీంతో వారు పిల్లులు పెంచుతున్న ఆ మహిళపై మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read: ప్రేక్షకుడి టైమ్ వేస్ట్ చేస్తారా!.. పివిఆర్ మల్లీప్లెక్స్కు జరిమానా
పోలీసులు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు
బౌంటీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని నాలుగో ఫ్లోర్లో నివసించే ఈ మహిళకు పిల్లులు అంటే చాలా ఇష్టమని స్థానికులు చెబుతున్నారు. ఆమె తన ఫ్లాట్లో మొదట్లో తక్కువ సంఖ్యలో పిల్లులనే పెంచేదని తెలిపారు. కానీ క్రమంగా పిల్లుల సంఖ్య పెరిగిందని, దీంతో పక్కనున్న వారికి ఇబ్బందులు మొదలయ్యాయని పేర్కొన్నారు. పిల్లులను ఎక్కువగా పెంచొద్దని ఆ మహిళను కోరినప్పటికీ, ఆమె అంగీకరించలేదని సొసైటీ సభ్యులు ముందుగా మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులోని వివరాలిలా ఉన్నాయి. “ఆ మహిళ ఫ్లాట్లో ఉన్న 350కి పైగా పిల్లుల వల్ల సొసైటీలో, దాని పరిసర ప్రాంతాల్లో భయంకరమైన దుర్వాసన వస్తోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో ఈ పిల్లులు చాలా పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. వాటిని చూసి అపార్ట్మెంట్లో ఉన్న చిన్న పిల్లలు భయపడుతున్నారు. ఇక్కడ భయానక వాతావరణం నెలకొంది.” అయితే కార్పొరేషన్ అధికారులు ముందుగా వందల సంఖ్యలో పిల్లులున్నాయంటే నమ్మలేదు. తీరా అక్కడికి వెళ్లి చూశాక.. అది నిజమేనని తేలింది. పిల్లులను లెక్క బెట్టి అవి 356 అని కార్పొరేషన్ అధికారి ఒకరు చెప్పారు. అయితే కార్పొరేషన్ అధికారులు మహిళతో వాటి గురించి ప్రశ్నించినా.. ఆమె వారితో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ మహిళ ఇంటిని తనిఖీ చేయడానికి రెండు రోజుల క్రితం ఆరోగ్య శాఖ అధికారి వచ్చారు. ఆ మహిళకు నోటీసు ఇచ్చారు. 48 గంటల్లోపు ఈ పిల్లులను ఫ్లాట్ నుంచి తొలగించాలని తెలిపారు. లేదంటే అధికారులే పిల్లులను తొలగిస్తారని పేర్కొన్నారు. అలాగే పోలీసు ఇన్స్పెక్టర్ నీలేశ్ జగ్దాలే కూడా పిల్లులు పెంచుతున్న ఫ్లాట్ను తనిఖీ చేశారు. ఆ మహిళ భారీ సంఖ్యలో పిల్లలు పెంచుతున్నట్లు ఫిర్యాదు అందిందని, ఆమెకు నోటీసు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తాము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చలు జరుపుతామని, వీలైనంత త్వరగా ఈ పిల్లులను తొలగిస్తామని సొసైటీ వాసులకు హామీ ఇచ్చారు.