Rahul Gandhi US Tariffs China Border | అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత ఎగుమతులపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా విధించిన టారిఫ్స్ భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఆరోపించారు. దీని వల్ల ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఆటో ఇండస్ట్రీ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన స్నేహితుడే టారిఫ్స్ విధించారని దీనిని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో సమాధానం చెప్పాలన్నారు. గురువారం లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా భారత్-చైనా వివాదాన్ని ఆయన ప్రస్తావిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడంపై రాహుల్ స్పందిస్తూ.. చైనా మన ప్రాంతంలో సుమారు 4వేల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించింది, కానీ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేయడం చూసి ఆశ్చర్యపోయానన్నారు.
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు చనిపోతే వారి బలిదానాన్ని పక్కన బెట్టి సంబురాలు జరుపుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇరు దేశాల మధ్య సాధారణ స్థితిత నెలకొనడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ దాని కన్నా ముందు మన భూమి మనం తిరిగి పొందాలన్నారు. దీని కోసం మునుపటి పరిస్థితిని పునరుద్దరించడం అవసరమని నొక్కి చెప్పారు. భూమిని తిరిగి పొండానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read: అవినీతిపరులైన జడ్జిలకు శిక్షలు లేవా?.. కానీ టీచర్లను తొలగిస్తారా?.. సుప్రీంపై మండిపడిన దీదీ
‘చైనా (China) భారత్కు చెందిన 4 వేల కి.మీ. పైగా భూభాగాన్ని ఆక్రమించింది. ఈ అంశంపై ప్రధాన మంత్రి మోదీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చైనా ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిసింది. అక్కడి రాయబారి ద్వారా ఈ విషయం బయటపడింది. దాన్ని తిరిగి తీసుకోవాలి. చైనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బహిరంగంగా ప్రకటన చేయాలి. భారత్పై అమెరికా 26శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి’ అని అన్నారు.
అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. రాహుల్పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘‘ఎవరి కాలంలో ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది? డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా అధికారులతో సూప్ తాగిన వ్యక్తులు ఎవరు? చైనీయుల నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ డబ్బులు ఎందుకు తీసుకుంది?. నేను ఒక్కటే చెబుతున్నా.. భారత భూభాగం నుంచి చైనా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.’’ అని కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు.
అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లతో పోలిస్తే.. తాము సగం మేర మాత్రమే వసూలు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో భారత్ తమకు వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే.. ట్రంప్ సుంకాల బాంబు వేశారు. భారత్ తమ ఉత్పత్తులపై సగటున 52% సుంకం విధిస్తున్నందున, తాము 27 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.