SIM Card New Rules: మొబైల్ యూజర్లకు కేంద్ర టెలికాం శాఖ (DoT) ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. కొత్తగా సిమ్ కార్డ్స్ తీసుకునేవారి కోసం ఆగస్టు 24వ తేదీ నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. పరిమితికి మించి సిమ్ కార్డ్స్ కలిగిన వారికి కొత్తగా మరో సిమ్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి టెలికాం రంగం సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను టెలికాం శాఖ జారీ చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
దేశంలో సగటున ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా 9 సిమ్స్ తీసుకునే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం భద్రతా కారణాల రిత్యా ఈ పరిమితిని 6కు కుదించారు. జియో, ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ ఇలా ఏ సిమ్ తీసుకున్నా ఈ పరిమితి వర్తించనుంది. అయితే ఆగస్టు 24 నుంచి ఈ లిమిట్ దాటిన వ్యక్తులకు ఎలాంటి సిమ్ ను జారీచేయవద్దని టెలికాం కంపెనీలను కేంద్రం ఆదేశించింది.
కొత్త నిబంధనల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తోంది. దీని ప్రకారం.. ప్రభుత్వానికి చెందిన ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్’ (DIP) ద్వారా ఫొటో ఆధారిత వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇప్పటికే గరిష్ట స్థాయిలో కనెక్షన్లు కలిగిన వినియోగదారుల ఫొటోలు, వివరాలను ప్రభుత్వం టెలికాం కంపెనీలకు అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా కొత్తగా ఎవరైనా సిమ్ కోసం వచ్చినప్పుడు కంపెనీలు ఆ డేటాబేస్ ద్వారా చెక్ చేయనున్నాయి. ఒకవేళ సదరు వ్యక్తికి సిమ్ పరిమితి దాటినట్లయితే అతడి దరఖాస్తును అక్కడికక్కడే తిరస్కరించనున్నారు.
Also Read: గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!
సామాన్యుల భద్రతను దృష్టిని ఉంచుకొని ఈ కొత్త రూల్ ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర టెలికాం వర్గాలు తెలిపాయి. సైబర్ నేరాలు, నకిలీ సిమ్ల ద్వారా జరిగే మోసాలను అరికట్టడమే ఈ రూల్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అయితే నిబంధనలు పాటిస్తూ.. పరిమితికి లోబడి ఉన్న వారికి ఈ మాత్రం ఈ రూల్ వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశాయి.
Also Read: యూఏఈ సంచలనం.. ఎడారి ఇసుకతో ఇటుకలు.. 50% తగ్గనున్న కన్స్ట్రక్షన్ కాస్ట్!