Zero Shadow Day: కర్ణాటక రాజధాని బెంగళూరులో రేపు ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. రేపు నగరంలో కాసేపు నీడ మాయం కానుంది. ఇలా కొంతసేపు నీడ మాయం అవడాన్ని ‘జీరో షాడో ’ అంటారు. రేపు బెంగళూరులో మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు అక్కడ ఆరు నిమిషాల పాటు నీడ కనిపించదు.
ఒక ప్రాంతంలో జీరో షాడో డే ఏడాదిలో రెండుసార్లు సంభవిస్తుందని ASI తెలిపింది. కర్కాటక, మకర రేఖల మధ్య ఉన్న అన్ని ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో జీరో షాడో కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో నివసించే వారికి ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి అక్షాంశానికి సమానంగా సూర్యుడి కాంతి కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. ఆ కొన్ని నిమిషాల్లోనే నీడలు కనిపించవు.
రేపు జీరో షాడో సమయంలో జీవులు, వస్తువులపై ఆరు నిమిషాల పాటు నిటారుగా సూర్యకిరణాలు పడతాయి. అందుకే ఆ సమయంలో నీడ కనిపించదు. జీరో షాడో డే సందర్భంగా బెంగళూరులోని కోరమంగళలో క్యాంపస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఓ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జీరో షాడో సమయంలో నీడ కనిపించని క్షణాలను ఈవెంట్లో చూపించనున్నారు.
Also Read: తల్లిదండ్రుల పక్కనే విమానంలో పిల్లలకు సీటు కేటాయించాలి : డీజీసీఏ
భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో దాని భ్రమణ అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇదే రుతువులు మారడానికి కారణమవుతుంది. దీంతో సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు వస్తువులు, జీవుల నీడ కనిపించదు. 23.5 డిగ్రీలు వంగి ఉన్న భూ భ్రమణ అక్షం మీదికి సూర్యుడు ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒక సారి సమానంగా వస్తాడు. దీన్ని జెనిత్ పొజిషన్ అని కూడా అంటారు. ఈ సమయంలో సూర్యుడు నడి నెత్తిమీదకు వచ్చినా నీడ కనిపించదు.