Srinivasa Mangapuram OTT: తిరుపతి… బళ్లారి… రెండు ప్రాంతాలు – రెండు పవర్ఫుల్ కుటుంబాలు. వాటి మధ్య చిక్కుకున్న ఓ ప్రేమకథ. పైగా హీరో ఎవరో కాదు… సూపర్స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని. ఆయనకు జోడీగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా తాడాని నటించిన సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీ… రొమాన్స్తో మొదలై మాస్ యాక్షన్, ఫ్యామిలీ గొడవలు, మైనింగ్ మాఫియా వరకు వెళ్లే కథగా తెరకెక్కింది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.
తిరుపతిలో పెద్దిరెడ్డి అనే పవర్ఫుల్ వ్యక్తి మాటే శాసనం. అతని కూతురు మంగ. అలాంటి కుటుంబంలో పెరిగిన మంగ జీవితంలోకి బళ్లారి నుంచి వచ్చిన శ్రీను అడుగుపెడతాడు. తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. పెద్దగా పట్టించుకోని మంగ కూడా… శ్రీను నిజాయితీ, ప్రేమను చూసి అతనికి దగ్గరవుతుంది. ఇద్దరి ప్రేమ మెల్లగా బలపడుతున్న సమయంలో అసలు సమస్య మొదలవుతుంది. మంగకు అప్పటికే మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమై ఉంటుంది.
తన కూతురి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పెద్దిరెడ్డి తనదైన శైలిలో నిర్ణయించుకుంటాడు. కానీ శ్రీను మాత్రం వెనక్కి తగ్గడు. మంగను పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తాడు. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. శ్రీను తిరుపతికి రావడం కేవలం మంగను ప్రేమించడానికేనా ? అతని గతం ఏంటి ? బళ్లారితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి ? అనే ప్రశ్నలకు ఇంటర్వెల్ దగ్గర సమాధానాలు దొరకడం మొదలవుతుంది.
సెకండాఫ్లో కథ పూర్తిగా బళ్లారి వైపు తిరుగుతుంది. అక్కడ మైనింగ్ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న వెంకటప్పయ్య నాయుడు రంగంలోకి దిగుతాడు. ఈ పాత్రలో మోహన్ బాబు కనిపిస్తారు. శ్రీను గతానికి వెంకటప్పయ్య నాయుడికి ఉన్న సంబంధం కథకు కీలకంగా మారుతుంది. ఒకవైపు మంగ కుటుంబం… మరోవైపు బళ్లారి మైనింగ్ మాఫియా… ఈ రెండు శక్తుల మధ్య శ్రీను ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది.
తన ప్రేమను దక్కించుకోవడమే కాకుండా, తన గతం నుంచి వచ్చిన ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వెంకటప్పయ్య నాయుడికి శ్రీనుకి మధ్య అసలు సంబంధం ఏంటి ? పెద్దిరెడ్డి ఎందుకు ఈ ప్రేమను అడ్డుకోవాలని చూస్తాడు ? మంగ కోసం శ్రీను ఎక్కడిదాకా వెళ్ళాడు ? చివరికి ఈ రెండు కుటుంబాల పగను దాటి శ్రీను, మంగ ఒక్కటయ్యారా? అనేదే సినిమా క్లైమాక్స్.
జయ కృష్ణకు ఇది డెబ్యూ మూవీ. రాషా తాడాని మంగ పాత్రలో మెరిసింది. మోహన్ బాబు, కిక్ శ్యామ్ వంటి సీనియర్ నటులు కథలో కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మాస్ టచ్ ఇచ్చాయి. థియేట్రికల్ గా రిలీజ్ అయిన 21 రోజులకే ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టింది. ఆగస్టు 20 నుంచి ‘శ్రీనివాస మంగాపురం’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. మొత్తానికి ప్రేమ, కుటుంబ పగలు, మైనింగ్ మాఫియా, యాక్షన్ కలిసిన మాస్ రొమాంటిక్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’ను ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు.
Read Also: పక్కింటి అబ్బాయితో 15 రోజులు… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే