ఆర్థిక లోటు నడుమ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన రేవంత్ సర్కార్ తనదైన పాలనా ముద్రను వేసుకునేందుకు తండ్లాడుతున్నారు. అందులో భాగమే రెండు లక్షల చేయూత పింఛన్లు ఇస్తున్నామనే లీకులు వచ్చాయి. వాస్తవానికి ఇద్దామనే ఉంది. కానీ అక్కడ పరిస్థితులు సహకరించడం లేదు. ఇచ్చేది నాలుగు వేల పింఛన్ కాదు. పాత పింఛనే రూ. 2016. కానీ కొత్తవి. అంటే ఓ రెండు లక్షలు అదనంగా ఈ సర్కార్ వచ్చిన తరువాత ఇవ్వబోతుందన్నమాట. ఇప్పటి వరకు అన్ని ఆసరా పింఛన్లు కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల వరకు ఉన్నాయి.
వీటికి అదనంగా మరో రెండు లక్షల పింఛన్లు పెంచాలనుకున్నా… ఆ భారం తట్టుకునే స్థితిలో సర్కార్ లేదు. అందుకే ఇవ్వాలా? వద్దా ? అనే ఇంకా ఊగిసలాటలో ఉంది. జిల్లాల్లో మాత్రం మొన్నటి వరకు కలెక్టర్లు రెడీగా ఉన్నారు. పాత దరఖాస్తులు వెతికి, అందులో కొందరిని సెలెక్టు చేసుకుని పెట్టుకున్నది. కానీ సీఎం నిన్న మీటింగు పెట్టి ఒంటరి మహిళలకు ప్రయార్టీ ఇవ్వాలని చెప్పగానే…. మళ్లీ వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ప్రభుత్వం మేము రెండు లక్షల కొత్త పింఛన్లను జూన్ 2న ఇవ్వబోతున్నామని చెప్పలేదు.
కానీ మీటింగు మాత్రం పెట్టుకుంది. క్లారిటీ ఆదేశాలు ఇంకా రాలేదు ఎవరికీ. మీ సేవా ఆప్షన్ ఇస్తున్నారా? ఎంపీడీవోలకు ఇచ్చారా ? క్లారిటీ లేదు. ఏ స్పష్టతా ఇవ్వకుంఆనే ఏదో చేయాలనుకుంటున్నది సర్కార్. కానీ ఏదీ చేసేలా లేదు. టైమ్ దగ్గర పడుతున్నది. తన పాలన వచ్చిన తరువాత ఏదీ కొత్త పథకం ప్రవేశపెట్టలేదు రేవంత్ రెడ్డి. రెండున్నరేండ్లు గడిచిపోయాయి. చేయూత పథకం ద్వారా రూ. 4వేల పింఛన్ ఇవ్వాలి. దాని ముచ్చట లేదు. ఇప్పట్లో ఇచ్చేలా కూడా లేరు. కానీ పాత పింఛన్నే కొనసాగిస్తూ.. అదనంగా రెండు లక్షలు ఇస్తే..కొంచెం వ్యతిరేక భావన తగ్గుతుందని భావించింది సర్కార్. కానీ అది ఆచరణలో సాధ్యం కావడం లేదు.
దీనిపై రేవంత్ బాగానే కసరత్తు చేశాడు. కానీ పరిస్థితులే అనుకూలించేలా లేవు. ఏదో మీటింగైతే పెట్టాడు. ఒంటరి మహిళలు అనే ఆదేశమొక్కటే వచ్చింది. వాస్తవానికి ఒంటరి మహిళల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక లక్ష పింఛన్లు ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. ఇప్పుడు వారి సంఖ్య పెద్దగా లేదు. మండలానికి పది, ఇరవైకి మించి ఉండరు. ఇక వితంతు పింఛన్ల కోసం చాలా మందే దరఖాస్తు చేసుకున్నారు. వృద్దుల సంఖ్య కూడా బాగానే ఉంది. వీరి దరఖాస్తులు పెండింగ్లో చాలానే ఉన్నాయి. అసలు ఏ దరఖాస్తుల క్రైటేరియాలో వీరిని అర్హలుగా ఎంపిక చేస్తారో కూడా తెలియదు.
కొత్తగా దరఖాస్తులు చేసుకోమని చెబుతామంటే.. ప్రభుత్వానికి భయం. గుంపులు గుంపులుగా మళ్లీ వస్తారని. కానీ ఇంతకు ముందు తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులేమయ్యాయో తెలియదు. అవి చెత్తబుట్ట పాలే అయ్యాయి. మరి ఎలా ఎంపిక చేస్తారు. సవాలక్ష గందరగోళాల మధ్య.. జనాన్ని తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నదీ సర్కార్. జూన్ 2 రానే వస్తున్నది. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎవరికి పింఛన్లు ఇస్తారు? ఇస్తారా? ఇవ్వరా? రూ. 4వేల పింఛన్ ఎప్పుడిస్తారు? సర్కార్ వద్ద సమాధానాలేవు. అందుకే దేనికీ అధికారికంగా రిప్లై ఇవ్వడం లేదు. ఉట్టి రిక్త హస్తాలతోనే మీటింగులైతే నిర్వహిస్తున్నది. జనాలను ఆశల పల్లికిలో ఊరేగిస్తున్నది.