బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా? బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదే సుమతీ! చిన్నప్పుడెప్పుడో చదువుకున్న గుర్తు. చాలా నీతిని బోధించే సుమతీ శతకంలోని ఓ పద్యం. ఇదిప్పుడు కొంచెం మార్చి చెప్పుకోవాల్సి వస్తుంది.. ప్రస్తుత దేశ రాజకీయాల పరిణామాల సందర్భంగా. బలవంతమైన సర్పము.. బొద్దింకల చేతజిక్కి చావదే సుమతీ! అని. దీన్ని కరెక్టుగా అర్థం చేసుకున్నది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఢిల్లీలో మీటింగు పెట్టి.. జాతీయ భావన పెంచేదిశగా ప్రయత్నం చేయడం కోసం.. బీజేపీని రక్షించడం ద్వారానే దేశభక్తిని నిరూపించుకోగలమే ఓ రంగు పులుముకుని.. తన పార్టీ నేతలకు నీతిబోధలు చేస్తూ ఈ కాక్రోచుల గురించి కామెంట్ చేశాడు. బలవంతమైన బీజేపీకి కూడా ఇలాంటి కాక్రోచు పార్టీల మూలంగా చచ్చినా చస్తుంది .. కాబట్టి దీన్ని ఉపేక్షించరాదు అనేది అతని మాటల సారాంశం.
అంటే ఈ బొద్దింకలను ఎక్కడికక్కడ వెంటాడి వేటాడి చితగ్గొట్టి.. చిత్తడి చేసి వదిలేయాలి. మనం లైట్గా తీసుకోవద్దని సూచించాడు. అంటే కేంద్రం కీ ఇస్తే తప్ప కదలని జనసేనాని.. ఈ మాటన్నాడంటే.. ఈ బొద్దింకలపై మోడీ ఎంత కలత చెందుతున్నాడో కదా! ఓవైపు దాడులకు తెగబడుతున్న అంశం కూడా ఆ పార్టీకి మరింత వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నది. కాక్రోచ్ పార్టీగా మూకుమ్మడిగా ఒక్క చోట చేరుతున్న సందర్భాన్ని కేంద్రం గ్రహించడం లేదు. ఇందులో జెన్-జీ ఇన్వాల్వ్ అయి ఉందని.
ఎంత దాన్ని అణచాలని చూస్తే.. గోడకు కొట్టిన బంతిలా అది అంతే స్పీడ్తో వచ్చి తాకుతుందే తప్ప.. తగ్గదు! మరెందుకు దాన్ని రెచ్చగొట్టడం. ఏదో ఆందోళన చేస్తున్నారు. చెయ్యనీయండి. రాజీనామాలు కోరుతున్నారు. వివరణ ఇవ్వండి. లోపాలపై స్పందించండి. యువతను గెలుచుకునే ప్రయత్నం చేయండి. వారిలో మీ పట్ల రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత ఎందుకో గుర్తించండి. దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి.. ! అవేమీ చేయకపోగా.. కాక్రోచులను రెచ్చగొట్టుకుని వాటిని తమ మీదకే కసిగా ఉసిగొల్పుకునేలా తమకు తామే ప్రేరిపించుకుని.. బలవంతమైన సర్పము మాదిరిగా వాటి కాట్లకు చచ్చిపోవాలనే దిశగా ఆలోచన చేయడమే ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం.
కాక్రోచులు కరిస్తే.. బలవంతమైన సర్పము చస్తుందా? వాస్తవానికి, కాక్రోచుల వెనుక నైతికంగా నిలుస్తున్నదని, వాటికి బలాన్నిచ్చి ప్రోత్సహిస్తున్నది.. కేంద్రంపై వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ. ఇవి కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే శక్తులు కూడా. బొద్దింకల పార్టీగానే అదిప్పుడు కనిపించొచ్చు. తమ శత్రువును స్పష్టతతో గుర్తించి.. లక్ష్యం ఎంచుకుని ముందుకు సాగుతున్న దాని తీరే ఇప్పుడు కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఇది కాంగ్రెస్కు అనుకూలతను తెచ్చిపెట్టేదే.
కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టే కాక్రోచులు రెచ్చిపోతున్నాయని కొందరంటున్నారు. వాస్తవానికి, కాక్రోచులు కాంగ్రెస్కు అదనపు బలంగా మారుతున్నాయి. కేంద్రం చర్యలు కూడా అలాగే ఉన్నాయి. అంతిమంగా ఇది ఎవరికి లాభమో.. ఎవరికి నష్టమో.. ఎవరిని మింగుతుందో.. ఎవరిని లేపుతుందో..! ఓ క్లారిటీ దాదాపుగా వచ్చేసింది. అందుకే కల్యాణ్ లాంటి ముసుగు తీసిన లీడర్లు ఇలా డేర్గానే ప్రకటనలు ఇస్తున్నారు. విచక్షణ లేకుండా… జాతీయ వాదం ముసుగులో అజ్ఞాన ప్రదర్శనలాగే ఆయన మాటలుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.