ఇద్దరూ ఇద్దరే! డౌన్ టు ఎర్త్.. కింది స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన వాళ్లే. తమకంటూ ఓ అనుచరగణం ఏర్పాటు చేసుకున్నవారు. ప్రజల అభిమానం పొందినవారే. మాస్ అప్పీల్ కలిగి ఉన్నారు వీరిద్దరు. కానీ వీరిద్దరికి ఒక దగ్గర బెడిసికొట్టింది. ఇప్పుడు అది పెరిగి అగాధమైంది. ఇద్దరి మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పర్చింది. ఆ ఇద్దరు ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈటల రాజేందర్.. బీఆరెస్లో సెకండ్ పొజిషన్. కేసీఆర్ తరువాత స్థానం. కానీ కేసీఆర్ ఎవరినీ కుదురుగా ఉండనివ్వడు కదా!ఎక్కడో బెడిసికొట్టింది ఈటలపై ఆయనకు. అందుకే ఓ ఫైన్ మార్నింగ్ చెక్పెట్టేశాడు ఈటలకు. తన టీ న్యూస్లోనే వార్తలు వేసి.. అవినీతి మంత్రిగా చిత్రీకరించాడు.
అప్పటి దాకా అన్నదమ్ముళ్లలా ఉన్నట్టు నటించిన కేసీఆర్ నిజస్వరూపం ఇంత వికృతంగా ఉంటుందా? అని ఈటల కూడా ఆశ్చర్యపడేలా. ఇక బీజేపీకి గూటికి చేరుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆయన బీఆరెస్ను వీడటం ఓ ఆశ్చర్యమైతే.. బీజేపీలో చేరడం మహదాశ్చర్యం. కమ్యూనిష్టు భావజాలం కలిగి ఉన్న ఈటల రాజేందర్ .. అప్పటి సమకాలీన పరిస్థితులు, తన రాజకీయ, వ్యక్తిగత భవితవ్యం కాపాడుకునే క్రమంలో అమిత్ షా, మోడీ భరోసా అవసరమైంది. ఈటలకు కూడా వారి భరోసా అన్ని రకాలుగా దొరికింది. ఇక విశ్వాసపాత్రుడిగా ఉండిపోయేందుకు రెడీ అయిపోయాడు. మానసికంగా అంతా సిద్దం చేసుకున్నాడు. కానీ అప్పటికే అక్కడ తిష్టవేసి ఉన్న సీనియర్లెవరు ఈటల రాకపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఏదో ఆయన అవసరానికి వచ్చాడే గానీ, మాకేంటీ లాభం.. మాకు పోటీ తప్ప..! అని చూశారే తప్ప.. ఈటల రాజేందర్కు ఉన్న మాస్ ఇమేజ్ను పార్టీకి అన్వయించుకుందాం.. బలపర్చుకుందామనే సోయి వారికి లేదు.
అంతగా పాతుకుపోయారు. డాక్టర్ లక్ష్మణ్, కిషన్రెడ్డిలంటే బీజేపీ. బీజేపీ అంటే వారిద్దరు అంతే. బండి సంజయ్ కూడా ఎదిగి వచ్చిన నాయకుడే. అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని ఉన్నవాడే. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అందిపుచ్చుకుని పార్టీని ఉరకలెత్తించిన వాడే. కానీ అక్కడే ఈటలకు, బండి సంజయ్కు మధ్య గ్యాప్ ఏర్పడింది. తనకు అధ్యక్ష పదవి ఇస్తారని భావించాడు ఈటల. దీని కోసమే బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఇక అక్కడ్నుంచి మొదలైన ఎడముఖం పెడముఖం.. కరీంనగర్ కేంద్రంగా ఎవరికి వారే గ్రూపులు మెయింటేన్ చేస్తూ.. బాహాటంగానే పరోక్షంగా ఒకరిపై మరొకరు అస్త్రశస్త్రాలు ప్రయోగించుకుంటూ ఆధిపత్యపోరే నడిపారు.
మొన్న బండి భగీరథ్ కేసు విషయంలో అవాస్తవాలు, అబద్దపు ప్రచారాలు, చెప్పుడు మాటలు .. బండికి, ఈటలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కోల్డ్ వార్ను మరింత పెంచాయి. ఈ కేసు వేడి కొద్దిగా సద్దుమణిగిన తరువాత… ఈటల రాజేందర్పై వెలిసిన పోస్టర్ల కలకలం మళ్లీ గ్రూపు రాజకీయాలకు నిద్రలేపాయి. ఈటలకు వ్యతిరేకంగా బండి వర్గమే ఆ పోస్టర్లు అతికించిందని మొదటి నుంచి ఈటల వర్గానికి అనుమానం. వారి అనుమానమే నిజమైంది. బండి సంజయ్ అనుచరుడే ప్రధాన సూత్రధారుడని తేలింది. పోలీసులు ఆ మేరకు కేసులు కట్టారు. అప్పటిదాకా లోలోన మరిగిపోతూ సైలెంట్గా ఉన్న ఈటల వర్గం ఒక్కసారిగా లేచింది. భగ్గుమన్నది. బండి సంజయ్, అతని అనుచరులపై సోషల్ మీడియా వేదికగా మాటల దాడులకు దిగింది. దీనిపై పెద్దలెవరూ జోక్యం చేసుకోవడం లేదు. ఒకరికి, ఇంకొకరికి మధ్య సఖ్యత లేదు.
పెద్దలు కిషన్రెడ్డి తన దారి తాను చూసుకోవడంలోనే బిజీగా ఉన్నాడు. తన రాజకీయం తనది. పార్టీ అంతర్గత విషయాలు పట్టించుకోడు. అధ్యక్షుల వారికి పై నుంచి ఆదేశాలు వస్తే తప్పే.. కీ ఇస్తే తప్ప.. నోటి వెంట మాట పెగలదు. దీంతో వీరి కోల్డ్వార్ రాష్ట్రాలు దాటి .. ఢిల్లీ పెద్దల వద్దకూ పోయింది. ఇక దీనికి ఎలా పుల్స్టాప్ పడుతుందో తెలియదు. చివరగా.. బండి సంజయ్.. మరీ అలా పోస్టర్ల రాజకీయాలకు దిగజారుతాడంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే.. అంత చీప్ రాజకీయ నాయకుడేం కాదు.. ఇక్కడ ఈ అనుచరుల అత్యుత్సాహమే వీరిద్దరి మధ్య ఇంకా గ్యాప్ను పెంచి.. పార్టీ పరంగా పరువును బజారుకీడ్చే పని చేస్తుందని అనుకుంటున్నారు వీరి గురించి ఐడియా ఉన్న నేతలు.