అంతా సర్ ( ఓటరు జాబితా సమగ్ర సవరణ) మీద పడ్డారు. ఓట్లన్నీ గల్లంతవుతాయనే భయం అందరినీ వెంటాడుతోంది. ఈనెల 25నుంచి నెల రోజుల పాటు ఈ సవరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే యంత్రాంగాన్ని దీని కోసం రెడీ చేసింది. ఓ వైపు బీఆరెస్, మరో వైపు కాంగ్రెస్ రెండూ.. సర్ విధానంపై అప్రమత్తంగా ఉన్నాయి. గతంలో దీని వల్ల ఇతర రాష్ట్రాల్లో గణనీయంగా ఓట్లు రద్దు కావడం వల్ల .. ఫలితాలు తారుమాయిన అనుభవం అందరినీ అలర్ట్ చేసింది.
ప్రధానంగా ముస్లిం ఓటర్లలో ఈ సర్ విధానంపై భయం ఉంది. దీంతో పాటు బీజేపీ వ్యతిరేక వర్గాల ఓట్లు కూడా చాలా వరకు పెండింగ్ పేరుతో జాబితాలో లేకుండా చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనంలో ఓ రకమైన భయం అలుముకుని ఉన్నది. దీని పట్ల రెండు పార్టీలు అప్రమత్తంగా ఉంటే.. బీజేపీ మాత్రం తమాషా చూస్తుంది. కత్తి మాది కాదు.. నెత్తీ మాది కాదు అన్నట్టుగానే ఉంది దాని వైఖరి. కాంగ్రెస్ ఓ వైపు తన ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు రంగంలోకి దిగగా.. వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి.. ఓటింగు శాతం తగ్గకుండా ఓట్లు గల్లంతు కాకుండా ఉంటే అది తమకే మంచిదనే కోణంలో బీఆరెస్ కూడా దూకుడుగానే పోతున్నది.
అయితే సర్ పేరిట జరుగుతున్న అవగాహన సదస్సులో ఓ సీక్రెట్ స్ట్రాటజీ ప్లే చేయబోతున్నది బీఆరెస్. ఎక్కడ అవగాహన సదస్సులు జరుగుతున్న.. అక్కడికి ముఖ్య అతిథిగా వెళ్తున్న కేటీఆర్.. ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుంటున్నాయి రెండు పార్టీలు. బీఆరెస్ మాత్రం ఒక్క బూత్కు ఇద్దరు చొప్పున ఏజెంట్లను నియమిస్తోంది. వీరంతా ఆ బూత్లోని ఓటర్లను పంచుకొని.. బీఎల్వోలతో..అంటే ఆశ వర్కర్లు, ఇతర సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగాలి.
నిబంధనల ప్రకారం ఫామ్స్ నింపడం, కొత్త ఓటరుకు అవకాశం.. అక్కడ స్థానికంగా ఉండని ఓటరును తొలగించాలనే విషయంపై దగ్గరుండి అన్నీ గమనించాలి. ఒకవేళ ఆ ఓటరు అక్కడ అందుబాటులో లేకున్నా.. ప్రతి ఎన్నికకు వచ్చి ఓటేస్తే.. అతని ఓటు పోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏదే. అవన్నీ వారు చేయాల్సిన బాధ్యతలే. కానీ దీనికి అదనంగా కేటీఆర్ మరో విషయం వారికి నూరి పోస్తున్నాడు. ఎలాగూ ఇంటింటి ప్రచారమే చేస్తున్నాం.. కాబట్టి.. దీన్ని ఓ ప్రచార అస్త్రంగా కూడా వాడుకోవాలని చూస్తున్నాడు.
అంటే స్వామికార్యం, స్వకార్యం అన్నట్టుగా.. ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటంటే.. కాంగ్రెస్ పాలనపై అక్కడ ప్రచారం చేయడం.. ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఇవ్వని హామీల గురించి అక్కడ ప్రస్తావించడం. ఉదాహరణకు.. మీకు తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ కిట్లు వస్తున్నాయా? పింఛన్ 4వేలు ఇస్తామన్నారు కదా? ఇస్తున్నారా? రైతుబంధు సకాలంలో పడుతుందా? రైతు చనిపోతే రైతుబీమా అందుతున్నదా? ఇలా సర్కార్ వైఫల్యాలన్నీ ఓమారు వారికి గుర్తు చేయాలి.
దీని ద్వారా కాంగ్రెస్ సర్కార్ హామీల అమలులో ఫెయిలయ్యింది.. వచ్చేది బీఆరెస్ సర్కారేనని వారిని మెంటల్గా రెడీ చేసి పెట్టడం.. దీని ద్వారా లోతుగా జనాల్లోకి వెళ్లవచ్చని బీఆరెస్ ఈ సీక్రెట్ వ్యూహాన్ని అమలు చేసేందుకు సర్ శిక్షణలో దీన్ని కూడా పొందుపరిచింది.