తెలంగాణలో ఉద్యమాలు మళ్లీ ఉధృతమవుతున్నాయి. సర్కార్కు దాదాపు సగం పీరియడ్ అయిపోవడం.. ఇంకా చాలా హామీలు పెండింగ్లో ఉండటంతో.. అన్ని వర్గాలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నాయి. బీఆరెస్ పాలనలో జరగనివి.. కాంగ్రెస్ పాలనలో జరుగుతాయని భావించారు చాలా మంది. ఆ పార్టీ ఇచ్చిన హామీలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
తెలంగాణ వచ్చిన తరువాత ఆశించిన ఫలితాలు రాలేదనే అసంతృప్తి కేసీఆర్ పాలనపై ఉంది. అయితే రేవంత్ సర్కార్ వచ్చినా… చూస్తూ ఉండగానే మూడేండ్లు దగ్గర పడ్డాయి. కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడ్నే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏ సెక్షన్ కూడా సంతృప్తిగా లేదు. దీనికి ఏవో కారణాలు చెబుతున్నా.. బడ్జెట్ బూచిని చూపుతున్నా.. అప్పుల తిప్పుల లెక్కలు చెప్పినా.. ఉహూ ఇక వినేలా లేరు.
అందుకే ఒక్కొక్కరూ బయలుదేరారు. మొదటగా ఉద్యమకారుల ఇష్యూ ప్రధానంగా వేడి మీద ఉన్నది. ఆ తరువాత అంతే తీవ్రతతో నిరుద్యోగులు కూడా నడుం బిగించారు. నిరుద్యోగులంటే .. ఇందులో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారిదే ఇప్పుడు ప్రధాన సమస్య ఉంది. వీరే ఇప్పుడు సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నారు.
మొదట తెలంగాణ ఉద్యమకారుల గురించి చెప్పుకుందాం! కేసీఆర్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి, అవహేళనకు గురైంది ఉద్యమకారులే. వీరికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఉద్యమ దళపతే సీఎం అయితే.. ఇక మాకు మంచి రోజులేనని మురిసిపోయారు. కానీ కేసీఆర్ మారిన మనిషి అని తరువాత తెలుసుకున్నారు. మాది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి.. ఆయన దేశాన్ని ఏలేందుకే రెడీ అయ్యాడే గానీ, ఇక్కడ తెలంగాణ జాతిని విస్మరిస్తున్నాననే సోయిలో లేకుండె. అందుకే ఫలితాలు అలా వచ్చాయి. ఫలితం అనుభవిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు భారీ హామీలిచ్చింది. 250 గజాల స్థలం ఇస్తానన్నది. నెలకు రూ. 25వేల పింఛన్ ఇస్తానన్నది. కానీ ఇప్పటిదాకా ఏం లేదు. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో.. వీరికి మద్దతుగా కవిత పోరాటాలు నిర్మిస్తున్న సందర్భంలో కేకే కమిటీ వేశారు. ఇది కూడా కాలయాపన కమిటీగానే చూస్తున్నారు ఉద్యమకారులు.
ఇక రేపు.. 2న ఉప్పల్ భగాయత్ను కవిత నేతృత్వంలో ఉద్యమకారులు ముట్టడించేందుకు రెడీ అయ్యారు. ఇది మరో మిలియన్ మార్చ్లా ఉంటుందని కవిత ముందే హింట్ ఇచ్చారు. దీన్ని విచ్చిన్నం చేసేందుకు సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటున్నది. కానీ ఇది తీవ్ర చర్చ.. రచ్చకు దారి తీసేలాగే ఉంది.
ఇక పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పటికే దిల్సుఖ్నగర్ రోడ్లు దద్దరిల్లుతున్నాయి నిరుద్యోగుల ఆందోళనలతో. వీరంతా 2నే.. అంటే రేపు.. సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. వీరికి కూడా కవిత సంఘీభావం తెలిపారు. ఉద్యమకారులతో పాటు తాము కూడా నిరుద్యోగులతో కలిసి సచివాలయం ముట్టడిలో పాల్గొంటామని ప్రకటించి ఉన్నారు కవిత.
ఈ నెల మొదటి వారంలో ఎస్సై, కానిస్టేబుళ్ల కోసం ఓ 5వేల నోటిఫికేషన్లు వేసేందుకు రెడీ అయ్యింది సర్కార్. కానీ 20వేల ఉద్యోగాలు కావాలంటున్నారు పోలీసుల ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న లక్షలాది మంది నిరుద్యోగులు. దీన్ని సర్కార్ పట్టించుకోవడం లేదు. పైగా.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటున్నది. సీఎం ప్రకటనపై ఇంకా భగ్గుమంటున్నారు నిరుద్యోగులు. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సచివాలయం ముట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు.
రేపు.. గురువారం సర్కార్ను ఘెరావ్ చేసేందుకు ఇటు ఉద్యమకారులు… అటు నిరుద్యోగులు సిద్దమయ్యారు.