Integrated Traffic: స్వేచ్చ బ్యూరో: భాగ్యనగరానికి సరికొత్త సాంకేతిక సొబగులు అద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను మేధోపరమైన మౌలిక సదుపాయాలు కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్’ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ‘అనలాగ్’, మౌలిక సదుపాయాల రంగ దిగ్గజం ‘మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ‘ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
ఈమేరకు ఎంసీహెచ్ ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అనలాగ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మెగా సంస్థ ఎండీ పి. కృష్ణారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ, హైదరాబాద్ మెట్రోరైల్ అదనపు ఎండీ బి. అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనలాగ్, మెగా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన “హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు” వివరాలను, భవిష్యత్తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు ,ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల రోడ్ మ్యాప్ను ముఖ్యమంత్రికి కంపెనీల ప్రతినిధులు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
Also read: Revanth Journey: ఈ నెల 4న సీఎం రేవంత్ థాంక్స్ గివింగ్ మీటింగ్.. ఎక్కడంటే..?
నగరంలో అత్యాధునిక ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్’ వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సెన్సర్లు, రోబోటిక్స్ వంటి అధునాతన సాంకేతికత ద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే పట్టణ రవాణా వ్యవస్థను ఎలా నిర్మించవచ్చో వివరించారు. ట్రాఫిక్ రద్దీని ఆటోమేటిక్గా గుర్తించి,దానికి అనుగుణంగా సిగ్నళ్ల సమయాన్ని మార్చే నిరంతర నిఘా వ్యవస్థ ను రూపొందించనున్నారు. ఇక నగరంలో నీటి లీకేజీలను ముందుగానే గుర్తించి, వృథాను అరికట్టడంతో పాటు తక్షణ మరమ్మతులు చేపట్టడం వంటి చర్యలు తీసుకోనున్నారు. అవసరానికి అనుగుణంగా మాత్రమే విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు ఎక్కడా ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సిగ్నల్స్ ఆటోమేటిక్గా గ్రీన్గా మారి మార్గాన్ని సుగమం చేయనున్నారు.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ సంస్థలకు పలు కీలక సూచనలు చేశారు.”హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ ‘ఇంటిగ్రేట్’ చేయాలి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో దానికి అనుగుణంగా సిగ్నల్స్ ఆటోమేటిక్గా పనిచేసేలా ఉండాలి. ముఖ్యంగా వాతావరణ మార్పుల (వర్షాలు, తుపాన్లు వంటివి) సమయంలో ట్రాఫిక్ను సమర్థవంతంగా క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఈ వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ తో అనుసంధానించాలి.” అని సీఎం సూచించారు.
Also read: Public Schools: ఆరుట్ల సక్సెస్తో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. వచ్చే 3 నెలల్లో ఆ మూడు ఓపెన్..?