రోజుకో రీతిన మాట్లాడి తన అహంకారం ఇంకా తగ్గలేదనే విధంగా కేటీఆర్ ఆరోపణలు మూటగట్టుకుంటూనే ఉన్నాడు. ఇది చాలదంటూ తాజాగా అతడు చేసిన కామెంట్స్ పై మరీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తను ఏ ఎన్నికల్లో పోటీ చేసినా.. ఒక్కరికి కూడా పైసలు పంచలేదు.. మద్యం పొయ్యలేదు.. అని కేటీఆర్ కామెంట్ చేశాడు. దీనిపై విరుచుకుపడుతున్నారంతా. కొందరైతే సిరిసిల్లలో బీఆరెస్ లీడర్లు పైసలు పంచుతూ దొరికిపోయిన వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. అవునూ.. ఇదిప్పుడు ఉన్నపళంగా ఎందుకు కేటీఆర్ అనాల్సి వచ్చింది?
తన గురించి తను గొప్పులు చెప్పుకునేందుకా? అందరూ మనీ ఇయ్యనిదే… మద్యం పంచనిదే గెలవరు.. అలాంటిది నేను మాత్రం అందుకు భిన్నం.. తనకు ఓటర్లు ఏమియ్యకపోయినా గెలిపించారు.. అంటే తన పట్ల వారికి ఎంత నమ్మకం. ఎంత భరోసా! ఎంత విశ్వాసం..! అని చెప్పదలుచుకున్నట్టున్నాడు. సరే, నీ గురించి నువ్వు బాగానే చెప్పుకున్నావు గానీ, మరి మీ గెలిచిన ఎమ్మెల్యేలు మీలాగ కాదన్నమాట! అదే కదా పరోక్షంగా నువ్వు ఒప్పుకున్నది. మందు, మనీ ఇయ్యనిదే ఓటర్లు ఓటేసేలా లేరు. ఓటేయరు. ఎవరైనా గెలిచారు.. అంటే వాళ్లు ఈ రెండూ చేసి గెలిచిన వాళ్లేనని తన మాటల ద్వారా క్లారిటీ ఇచ్చాడన్నమాట.
ఈ మాటల ద్వారా ఓటరును కించపరచడమే కాదు.. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలను ప్రలోభ పెట్టి గెలిచారు… అని కూడా చెప్పినట్టే కదా!మొత్తంగా తన తండ్రి కూడా ఈ విధంగా గెలిచిన వాడే… కానీ తను మాత్రం అందరికీ అతీతుడని చెప్పినట్టే కదా! మరీ ఇంత స్వోత్కర్ష ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడు నీకు నువ్వే ఇలా భేష్ అని జబ్బలు చరుచుకునే సర్టిఫికెట్ ఒకటి ఇచ్చుకోవాల్సిన అనివార్యత ఎందుకు వచ్చిపడిందో తెలియదు.
ఒక్కడిని గొప్పోడుగా చేసుకునే క్రమంలో అందరినీ బక్రాలుగా చూపే ప్రయత్నంలో.. ఓటరుకు ఓ స్టాంప్ వేశాడు. వీరు మందు, మనీ ఇవ్వనిదే ఓటేయరని. అంటే ఓట్లేసిన ప్రతీ ఒక్కడు పైసలు తీసుకుని, వారిచ్చిన క్వార్టర్ మద్యం తాగినోళ్లేనా? ఇంకో పాయింటు ఇక్కడ.. అసలు ఇంతలా మందు, మనీ అలవాటు చేసిన ఘనత ఎవరిదో తెలుసా రామన్నా? మన బాపు కేసీఆర్దే.
అవును ఎన్నికలను ఇంతలా కాస్ట్లీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎంత ఖర్చైనా చేస్తా.. గెలిచి తీరాలె. బీఆరెఎస్ గెలిస్తేనే తెలంగాణ గెలిచినట్టు.. ! అనే ఫీలింగు తీసుకొచ్చాడు. దీని కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసే సంస్కృతిని తెలంగాణలో అలవాటు చేశాడు కేసీఆర్. మోడీ ఏం చేసినా దేశం కోసం.. ధర్మం కోసం..! కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ కోసం.. తెలంగాణ బాగు కోసం.. బంగారు తెలంగాణ కోసం! అంతే.. ఇదే నినాదాన్ని బలంగా తీసుకుపోగలిగారు జనాల్లోకి ఈ ఇద్దరు. ఒకరి హవా ఇంకా కొనసాగుతోంది. ఒకరు ఫామ్హౌజ్కు పరిమితమయ్యారు. ఈ ట్యాగ్లైన్లకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చింది. నమ్మేలా లేరు జనాలు. అందుకే కొత్త నినాదాలేమైనా తీసుకొస్తారేమో చూడాలి.