R&B Transfers: స్వేచ్ఛ బ్యూరో: రహదారులు, భవనాల(ఆర్ అండ్ బీ) శాఖలో వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితి ముగిసిన తర్వాత ఉద్యోగులు బదిలీ కావాల్సి ఉన్నా, ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలోని కొందరు సిబ్బంది మాత్రం ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట వేసి కూర్చున్నారు. దాదాపు 14 సంవత్సరాలుగా ఒకే స్థానంలో కొనసాగుతూ, బదిలీ కాకుండా కాలం వెళ్లదీస్తున్న వైనం ఇప్పుడు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచే కొనసాగుతున్న పలువురు సిబ్బంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తయినా నేటికీ ఎలాంటి బదిలీల్లేకుండా ఒకచోట తిష్ట వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో ప్రధానంగా నలుగురు నాన్-టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్లు(ఎన్టీపీఏ), 16 మంది సూపరింటెండెంట్లలో ఓ ఐదుగురు సూపరింటెండెంట్లు సుదీర్ఘ కాలంగా బదిలీల్లేకుండా ఒకే కార్యాలయంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
సుదీర్ఘ కాలంగా ఒకే చోట ఉండటంతో సదరు విభాగాలపై వీరు పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్ల కదలికల నుంచి కీలక నిర్ణయాల వరకు అంతా తామే అయి వ్యవహరిస్తూ, శాఖను తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సుదీర్ఘ ప్రస్థానానికి వెనుక ఉన్న రహస్యం పైఅధికారులను మేనేజ్ చేయడమేనని శాఖలో అంతర్గతంగా గుసగుసలాడుకుంటున్నారు. లూప్హోల్స్ను ఆసరాగా చేసుకుని, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్నతాధికారులు సైతం తమకెందుకులే అనే ధోరణిలో వ్యవహరిస్తూ, కంటితుడుపుగా చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బదిలీల ప్రక్రియను నిష్పాక్షికంగా చేపట్టాల్సిన ఆఫీసర్లు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ కొద్దిమందిని కదిలిస్తే.. ఇతరులను కూడా బదిలీ చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఎవరినీ కదపకుండా అలాగే వదిలేసినట్లు సమాచారం.
Also read: Vehicle Dealers: టీఆర్ నెంబర్ లేకుండా బండి డెలివరీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి శాఖలో సాధారణంగా మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఆర్&బీ హెచ్ఓడీ కార్యాలయంలో మాత్రం ఆ విధానం అమలవుతున్నట్లు కనిపించడం లేదు. కొంతమంది ఉద్యోగుల ప్రభావం, ఆధిపత్యం కారణంగా బదిలీల వ్యవస్థ మరుగున పడినట్లు ఉద్యోగుల్లో భావన నెలకొంది. దీని ప్రభావం దిగువ స్థాయి ఉద్యోగులపై తీవ్రంగా పడుతోంది. వారికి సమాన అవకాశాలు, పరిపాలనా అనుభవం, ఉద్యోగ పురోగతికి అవసరమైన అవకాశాలు దూరమవుతున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో శాఖ పనితీరు, ఉద్యోగుల మనోధైర్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఏళ్ల తరబడి కొందరే ఒకోచోట కొనసాగుతుండటంతో ట్రాన్స్ ఫర్ర పై మారాలనుకున్న అర్హులైన ఇతర సిబ్బందికి తీవ్ర ఇబ్బందిగా మారింది. దీనివల్ల ప్రమోషన్లు వచ్చిన వారు, వేరే ప్రాంతాల నుంచి బదిలీపై రావాలనుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు జరగకపోవడంతో శాఖలో పనితీరు మందగించడమే కాకుండా, ఇతర సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. శాఖలో పారదర్శకత, సమానత్వం, పరిపాలనా సమర్థత పెంపొందించే దిశగా వీలైనంత త్వరగా బదిలీలు నిర్వహించాలని పట్టుపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి, ఆర్ అండ్ బీ శాఖలో తిష్టవేసిన సిబ్బందిపై దృష్టి సారించి నిష్పాక్షికంగా బదిలీలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also read: Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!