బీఆరెస్ ఫక్తు రాజకీయ పార్టీ కదా! అందుకే తెలంగాణ అస్తిత్వం, ఆకాంక్షలను పట్టించుకోవడం ఏనాడో మరిచిపోయింది. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పుడు ఉద్యమం, సెంటిమెంట్ అంటే జనం కనెక్టు కారుకదా ! అని అనుకుని ఉంటారు. అందుకే తాజాగా స్థానికత అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో సైలెంట్గా ఉండిపోయారు.
ఒకప్పుడు సర్కార్ ఏ జీవో ఇచ్చినా.. నిర్ణయమేదైనా… అది తెలంగాణ సమాజానికి, నిరుద్యోగులకు , ఉద్యోగులకు ఏమాత్రం నష్టం చేసేదిగా ఉన్నా.. వెంటనే దాన్ని వ్యతిరేకించే పార్టీ బీఆరెస్. అది పేరు మార్చుకున్న తరువాత తన సైద్ధాంతిక విధానాలను కూడా మార్చుకున్నదని తెలుస్తూనే ఉంది.
తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో లోకల్, నాన్ లోకల్ లొల్లికి ఆజ్యం పోసింది. హైదరాబాద్లో ఓ నాలుగేళ్లు ఇంజినీరింగ్ కోర్సులు చేసి ఉంటే చాలు వాళ్లు లోకల్ కిందకే వస్తారు.. ఇక్కడి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు వారు అర్హులు అని తీర్పు తేల్చింది. దీనిపై మొట్టమొదటిగా, వెంటనే స్పందించారు.. టీఆరెస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. దీనిపై నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యచరణను కూడా ప్రకటించారు.
నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టి.. ప్రభుత్వంపై దీని విషయంలో ఒత్తిడి పెంచారు. కవిత నిన్న మీటింగులో కూడా చురకలు పెట్టారు. తెలంగాణ మేథావులంతా పదవులకు ఆశపడి స్థానికత విషయంలో మాట్లాడటం లేదని, తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. పరోక్షంగా కోదండరామ్ను ఆమె టార్గెట్ చేశారు. ఇది బీఆరెస్కు కూడా సెగ పెట్టింది.
వెంటనే ఇవాళ ఆ పార్టీ లీడర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీ ప్రసాద్ తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ పెట్టారు. మూడేండ్లు తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చదివితే స్థానికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. మళ్లీ మూల్కీ ఉద్యమం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. కవిత కూడా ఇదే డిమాండ్ చేశారు. నాలుగేళ్ల ప్రాతిపదికన కాకుండా ముల్కీ రూల్స్ను అనుసరించి పదిహేనేళ్లు ఇక్కడ ఉన్నవారినే స్థానికులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఇవే మాటలు బీఆరెస్ నోటి వెంట వస్తున్నాయి. తెలంగాణ యువత, నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ పాలన తీవ్ర అసంతృప్తినే మిగిల్చింది. వారి ఓటమికి ఈ అంశమే తీవ్ర ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు ఈ స్థానికత అంశంపైన బీఆరెస్ ఎందుకు తనదైన స్టైల్లో గళం విప్పడం లేదు.. కవిత మాట్లాడింది కాబట్టి తాను దానిపై మాట్లాడనని కేటీఆర్ పంతంతో ఉన్నట్టున్నాడు.
ఇక్కడ తెలంగాణ అస్తిత్వం, యువత అవసరాలు, తెలంగాణ హక్కులు.. వీటిపైన పరిస్థితి తీవ్రతను బట్టి స్పందించాల్సిన నేతలు.. ఎవరో ఒకరితో ఓ ప్రెస్మీట్ పెట్టిస్తే సరిపోతుందిలే! అన్నట్టుగా చేతులు దులుపుకునేలాగే స్పందించింది బీఆరెస్. కవిత తీసుకున్న అంశాన్ని కేటీఆర్ సీరియస్గా తీసుకోడమన్నమాట. ఇది రెండు రాజకీయ పార్టీల ఇష్యూ కాదు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యగా చూడాలి. కానీ కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ కూడా పంతం రాజకీయాలే నడుపుతున్నాడు. దీని వల్ల తెలంగాణకు పార్టీ దూరమవుతుందనే భావన కూడా వారిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ఈ స్థానికత అంశం.. మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా దీని విషయంలో స్పందించకపోతే.. ఆలస్యం చేసినకొద్దీ నష్టమే జరుగుతుంది!