రేవంత్ సవాల్ విసిరాడు. అభివృద్ధి మీద. ఎవరెంత చేశారో చర్చిద్దామని. దీన్ని బీఆరెస్ స్వీకరించింది. రైతుల కోసం మీరెంత ఖర్చు చేశారు. మేమెంత ఖర్చు చేశాం..? మేం చేసిన అప్పులెన్ని…? అప్పులు చేసి మేమేం చేశాం..? మీరు రెండున్నరేళ్లలోనే చేసిన అప్పెంత..? ఏమేం చేశారు..? రా చర్చిద్దాం.. అని ప్రతిసవాల్ విసిరాడు.
డేట్, ప్లేస్, అంశం.. ( అప్పులు, రైతుల సంక్షేమం, ఉద్యోగాలు..) ఏదైనా సరే, నీ ఇష్టం అని ఆఫర్ కూడా ఇచ్చాడు కేటీఆర్. తన ప్రెస్మీట్లోనే దాదాపుగా తను చెప్పాల్సిందంతా చెప్పాడు కేటీఆర్. వివరణలు ఇచ్చుకున్నాడు. గణాంకాలు ముందేసుకున్నాడు. ఇవి కాగ్ లెక్కలన్నాడు. మీవి కాకిలెక్కలన్నాడు. సరిపోయింది. కానీ రాజకీయమంటే అది కాదు కదా.. అందుకే తానూ ఓ సవాల్ విసిరాడు. దీనిపై రేవంత్ ఏం స్పందించలేదు.
కానీ మంత్రి జూపల్లి మాత్రం స్పందించాడు. తెలంగాణ భవన్కు వస్తానన్నాడు. వస్తున్నా.. ఇక చూస్కో కాస్కో అన్నాడు. ఇలా మంత్రి అన్నాడో లేదో.. అక్కడ గన్పార్క్ దగ్గర మరో ఇద్దరు మంత్రులు.. పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్లు బైఠాయించారు. ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ .. గురుకులాల్లో దాదాపు 2వేల కోట్ల అవినీతికి కాంగ్రెస్ పెద్దలు పాల్పడ్డారనేది ఆయన ఆరోపణ. రా మరి చర్చిద్దాం..అవి వాళ్లిద్దరు అక్కడ బైఠాయించారు.
పొద్దున్నే టీవీలు పెట్టుకుని ఇవాళ వార్తల విశేషాలేమిటీ..? అని చూద్దామనుకున్న సగటు వీక్షకుడికి దిమ్మదిరిగే వార్తలు కనిపించాయి. అధికార పక్షమా? ప్రతిపక్షమా? ఎవరు ఎవరికి సవాల్ చేశారు? ఎవరెవరు ఎక్కడెక్కడ చర్చకు సై అంటున్నారు? ఎవరు ఎటు పోతున్నారు? మధ్యలో పోలీసులు ఎవరిని అడ్డగించారు? అసలు ఈ చర్చలు దేని కోసం? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టుగా అప్పుల చిట్టాలు విప్పుకునేందుకా? అవినీతిలో ఎవరు ఎంత దోచుకున్నారో.. లెక్కలు తేల్చుకునేందుకా? నిజం చెప్పాలంటే చాలా గందోరగోళం… అమోయమం…!
గన్పార్క్ దగ్గర ఓ ఇద్దరు మంత్రులు… రారమ్మంటున్నారు. తెలంగాణ భవన్లో ఉద్రిక్తత అని బ్రేకింగులు… అరేయ్..! రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందిరా? వీరు ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా బాబు…! అని జనం తిట్టుకున్నారంటే నమ్మండి. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇద్దరినీ. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేశారని కాదు ఇక్కడ అసలు పాయింట్. ఇద్దరూ చేసేది, చేస్తున్నది తప్పేనని.
అవును.. కరెక్టుగా జనం ఇదే అనుకుంటున్నారు. పదేళ్ల పాలనపై పదే పదే రేవంత్ ఎందుకు మాట్లాడాలి? చేయాల్సిందేదో చేయవచ్చు కదా! రైతు పండుగ అన్నావు. మరి ఆ రైతులకు ఎలా డబ్బులు అందుతున్నాయి. వారు పనులు ఎలా చేసుకుంటున్నారు? వీటిపైన గదా సర్కార్ నజర్ పెట్టాల్సింది.
సవాళ్లు విసురుకుంటూ.. తొడలు చరుచుకుంటూ.. బరిలోకి దుముకుకుంటూ.. అధికార పార్టీకి ఇది అవసరమా? ఇక బీఆరెస్ దీన్నే కోరుకుంటున్నది.అటెన్షన్ డైవర్టయ్యింది. ఏమైంది వస్తామన్నారు కదా! రాలేదెందుకు? అని .. తెలంగాణ భవన్లో ఓ రెండు కుర్చీలు వేశాడు కేటీఆర్. జనం చూసి… అవ్..! నిజమే కాంగ్రెస్ వాళ్లు తోకముడిచారు. అయితే బీఆరెస్ చెబుతున్నదే నిజం… అని అనుకోవాలని కేటీఆర్ అనుకుని భ్రమపడి, సెట్టింగ్ సెట్ చేసి మీడియాకు మంచి పాయింట్స్ ఇచ్చి.. తనకు కావాల్సిన రాజకీయం తను చేసుకున్నాడు.
ఇది ఎవరి అవసరం తీర్చింది? ఏ జనం దీన్ని కోరుకున్నది..? గెలికి కయ్యం ఎందుకు ఎవరితో పెట్టుకున్నారు? ఇంకా సగటు వీక్షకుడు ప్రేక్షకుడే అయ్యాడు. అతని ముఖంలో అన్నీ ప్రశ్నార్థకాలే. ఏం జరుగుతుందో ఏమో తెలియక ఎడ్డి ముఖం వేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరూ ఒకరికొకరు కెలుక్కుని మేం గెలిచామంటే మేం గెలిచామని జబ్బలు చరుచుకుంటున్న వేళ.. ఓడింది మేమేనని జనం ముఖం వేలాడేశారు.