Mist Cooling: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాంక్రీట్ అడవులుగా మారిన నగర వాసులు.. భానుడి భగభగలతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే చైనా నగరాల్లోని భవనాల పైకప్పుల నుండి కృత్రిమ వర్షం కురిపిస్తున్న విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ నీటి తుంపర్ల ద్వారా వేడికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఈ టెక్నాలజీ ఏంటి? భవనాల నుండి పడే పొగమంచు లాంటి నీటి తుంపర్లు వేడిని ఎలా తగ్గిస్తాయి? చైనా ఎందుకు ఈ వినూత్న మార్గాలను వెతుకుతోంది? అనే ఆసక్తికర విశేషాలను ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా ఎండ ఎక్కువగా ఉంటే మనం ఇంట్లో ఏసీలు ఆన్ చేసుకుంటాం. కానీ చైనా మాత్రం ఏకంగా నగర వీధుల ఉష్ణోగ్రతలనే తగ్గించే పనిలో పడింది. దీనికోసం చైనాలోని బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ల పైకప్పులపై (Rooftops) ప్రత్యేకమైన ‘మిస్టింగ్ సిస్టమ్స్’ (Misting Systems) ను రూపొందించింది. దీని సాయంతో నీటి తుంపర్లను పొగమంచులా విడుదల చేస్తోంది. ఎండ తీవ్రత పెరగగానే ఈ వ్యవస్థ.. భవనాల పైనుండి సన్నటి నీటి తుంపర్లను కిందకు కురిపిస్తుంది. తద్వారా స్థానికులకు ఎండ వేడి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తోంది.
In central China’s Shanxi, a residential community has drawn attention for its “rooftop rain” — a mist cooling system that drops surface temperatures by 5–8°C in minutes. pic.twitter.com/AuXyJ0LFtJ
— Mao Ning 毛宁 (@SpoxCHN_MaoNing) July 1, 2026
భవనాల నుండి వచ్చే ఈ సన్నటి పొగమంచు గాలిని ఎలా చల్లబరుస్తుందనే దాని వెనుక ‘ఇవాపొరేటివ్ కూలింగ్’ అనే శాస్త్రీయ సూత్రం దాగుంది. ముందుగా హై-ప్రెజర్ పంపులు, ప్రత్యేక నాజిళ్ల ద్వారా నీటిని అత్యంత సన్నటి తుంపర్లుగా నీటిని గాలిలోకి విడుదల చేస్తారు. అప్పుడు అవి తమ చుట్టుపక్కల వాతావరణంలోని వేడిని గ్రహిస్తాయి. ఈ తుంపర్లు చాలా చిన్నగా ఉండటం వల్ల.. అవి వేడిని గ్రహించిన వెంటనే గాల్లోకి ఆవిరైపోతాయి. అప్పటికే ఆ తుంపర్లు చుట్టుపక్కల ఉన్న వేడిని లాగేసుకోవడం వల్ల గాలిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. ఈ విధానం ద్వారా పరిసరాల ఉష్ణోగ్రతను 3 నుండి 6 డిగ్రీల సెల్సియస్ వరకు, కొన్ని చోట్ల అయితే గరిష్టంగా 10 డిగ్రీల వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: 40 డిగ్రీలకే కరిగిన బ్రిటన్ రోడ్లు.. 45 దాటినా చెక్కుచెదరని భారత్ రోడ్లు.. అసలు రహస్యం ఇదే!
చైనాలోని పెద్ద నగరాల్లో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. అందరూ ఏసీలు వాడటం వల్ల పవర్ గ్రిడ్లపై భారం పడి విద్యుత్ కొరత ఏర్పడుతోంది. సాంప్రదాయ ఏసీలు వాడటం వల్ల గ్రీన్హౌస్ వాయువులు విడుదలై గ్లోబల్ వార్మింగ్ సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు.. ఈ మిస్టింగ్ సిస్టమ్స్ శ్రీకారం చుట్టారు. ఏసీల తరహాలో దీనికి కంప్రెసర్లు అవసరం లేదు. కేవలం నీటి ప్రెజర్ తో మాత్రమే ఇవి పనిచేస్తాయి. కాబట్టి ఇవి చాలా తక్కువ విద్యుత్ను వినియోగిస్తాయి. ఈ మిస్టింగ్ టెక్నాలజీ ద్వారా ఓపెన్ గార్డెన్లు, వాకింగ్ ట్రాక్లు, బాల్కనీల వద్ద సహజసిద్ధమైన చల్లదనాన్ని సృష్టించి.. ఏసీలు వినియోగాన్ని తగ్గించాలని చైనా భావిస్తోంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని కంట్రోల్ చేయాలని వ్యూహం రచిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలవుతున్న ఈ మిస్టింగ్ సాంకేతికతను ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించాలన్న యోచనలో అక్కడి అధికారులు ఉన్నారు.
Also Read: ఏఐ క్లీనిక్స్.. డాక్టర్ లేకుండానే సెకన్లలో రోగ నిర్ధరణ, చికిత్స.. మందులు కూడా అవే ఇచ్చేస్తాయ్!