ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డికి .. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఆర్మూర్లో ఓ ఉర్దూ టీచర్పై అక్కడి బీజేపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీని వెనుక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే దీనిపై ఈరవత్రి అనిల్ తీవ్రంగా స్పందించారు.
నందిపేటలో జరిగిన సర్..అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి ఉదంతంపై ఆయన మాట్లాడారు. ఆర్మూర్లో అభివృద్ది చేయడం చేతగాక.. మత విధ్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాడని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి మత కలహాలు సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తన అనుచరులను ఉసిగొల్పి ఈ విధంగా మతాన్ని టార్గెట్ చేసుకుని దాడి చేయడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అంటేనే మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అని, ఆ పార్టీకి అది తప్ప ఏదీ చేతకాదన్నారు.
అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉండే మతాలను విడదీసి, వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా రాకేశ్రెడ్డి కార్య కలాపాలు ఉంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఈ విధమైన దుశ్చర్యలను చూస్తూ ఊరుకోరన్నారు. రాకేశ్రెడ్డివి రెండు కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతారని వార్నింగ్ ఇచ్చార అనిల్. పొద్దున లేస్తే మతం గురించే పలవరించే రాకేశ్రెడ్డిని అనవసరంగా గెలిపించామని ఆర్మూర్ ప్రజలు బాధపడుతున్నారని,ఇకనైనా తన తీరు మార్చుకోవాలని అనిల్ హితవు పలికారు.
బీజేపీ పార్టీ అంటేనే ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసే పార్టీ అని, ఈ పార్టీ పట్ల.. నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాట్లాడితే ముస్లింలను దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న రాకేశ్రెడ్డి విధానాలను ఆర్మూర్ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి విషయంలో నిలదీయాలన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన సాధించిందేమీ లేదని, ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఇలా మతాల మధ్య చిచ్చుపెట్టి పైశాచికానందం పొందుతున్నాడని తీవ్రంగా ఆరోపించారు.
అనిల్ చేసిన కామెంట్స్ నిజామాబాద్ జిల్లాలో వైరల్గా మారాయి. ఎమ్మెల్యే కాళ్లు విరగ్గొడతామనే హెచ్చరిక చర్చనీయాంశమవుతోంది. ఇది ఇందూరు బీజేపీలో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంకా దీనిపై బీజేపీ నేతలెవరూ స్పందించలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రాకేశ్రెడ్డి ఆర్మూర్కు చేసిందేమీ లేదనే విషయాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకుపోగలుగుతోంది. దీనికి తోడు బీజేపీ చేసే దాడులను కూడా జనం ముందుంచి… నిలదీసేందుకు రెడీ అయింది. దీంతో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరుగా కొనసాగుతోంది. అనిల్ వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయంగా చర్చకు తెర తీశాయి.