ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై రచ్చ నడుస్తోంది. రాజకీయ పార్టీలలో కాదు. సోసల్ మీడియాలో. తెలంగాణ వాదుల్లో. కానీ ఏ ఒక్క పార్టీ కూడా అధికారికంగా సర్కార్ చేస్తున్న ఈ చర్యను తప్పుబట్టలేదు. తాజాగా మహానాడులో తెలంగాణ విషయంలో జరగిన ఘోర అవమానం తరువాత కూడా… ఏ ఒక్కరూ నోరు మెదపలేరంటే.. ఇప్పుడున్న రాజకీయ అససరాలు ఎలా ఉన్నాయో.. ? దానికి ఎన్టీఆర్ విగ్రహమే సాక్షం. ఆయన్ను కాదనలేరు. ఆయన టీడీపీ పార్టే కానీ.. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నట్టు కాదు. ఆయనది ఆంధ్రా పార్టే కానీ.. వారు టీడీపీకి ఓటేయరు. హైదరాబాద్లోని ఈ అంతరం, ఆ పరిణామం… అన్నీ రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచకునే ప్రయత్నమే చేస్తున్నాయి.
చంద్రబాబును తెలంగాణకు విలన్గా చూపి బీఆరెస్ ఎంత ఎదిగిందో.. ఎంతగా తెలంగాణ ప్రజలకు దగ్గరైందో తెలుసు. కానీ అవి అప్పటి పరిస్థితులు. ఇప్పుడు ఇదే బీఆరెస్, ఇదే కేసీఆర్.. దే కేటీఆర్.. రేవంత్ సర్కార్ను ఈ విగ్రహ ఏర్పాటు విషయంలో తూలనాడగలడా? విమర్శించడం అటుంచి.. మేము కాంగ్రెస్ కన్నా ఎక్కువ విగ్రహాలు పెట్టాం తెలుసా? అని మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వయంగా కేటీఆర్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే అప్పటి ఉద్యమ పరిస్థితులు వేరు.. ఇప్పటి రాజకీయ అవసరాలు వేరు. సెటిలర్ల ఓట్లు అందరికీ కావాలి. కానీ టీడీపీ ఇక్కడ రాదు. మరి వారంతా ఏపక్షం ఉండాలి? అధికారంలో ఏపార్టీ ఉంటే.. సహజంగా వారి వైపే ఉంటున్నారు వీరు. ఎందుకు? వారికి కావాల్సింది అభివృద్ధి. బీఆరెఎస్ హయాంలో హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ది చెందింది. దీన్ని కాదనలేం. అందుకే ఆ పార్టీ వైపే ఉన్నారు ఇక్కడి సెటిలర్లు. అంటే టీడీపీ శ్రేయోభిలాషులు. ఎన్టీఆర్ అభిమానులు. చంద్రబాబు బాగుకోరే వారు.
వీరంతా ఇప్పుడు ఏ పార్టీని ఎంచుకోవాలి..? మొన్నటి దాకా బీఆరెస్తో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల్లోనే బీఆరెస్కు ఎక్కువ సీట్లు రావడం కూడా ఇక్కడ డెవలప్మెంట్ను చూసే. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇష్యూలు బీఆరెస్కు వ్యతిరేకంగా మారాయి. ముఖ్యంగా సిట్టింగులకే మళ్లీ మళ్లీ టికెట్లివ్వడం దగ్గర నుంచి సవాలక్ష సమస్యలు. కానీ హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల మాత్రం ఇవేమీ చూడలేదు. మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండాలి..నగరం మరింత అభివృద్ధి కావాలి.. అనుకున్నారు. అది బీఆరెస్ కూడా గ్రహించింది. దీన్ని మొదటగా కేసీఆరే. తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తమది ఇకపై ఉద్యమపార్టీ కాదని, ఫక్తు రాజకీయ పార్టీనేనని ఆనాడే అన్నాడు. సెటిలర్ల కాళ్లకు ముళ్లు గుచ్చితే నోటితో తీస్తానన్నాడు.
అంతే ఉద్యమ సమయంలో వ్యతిరేక పార్టీ.. లక్ష్యం సాధించిన తరువాత అధికారం కోసం ఆ పార్టీని కలుపుకుపోవాల్సిందే. అదే చేశాడు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నాడు. బాజాప్తాగా చంద్రబాబుతో ఇప్పటికీ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నానని చెప్పినప్పుడు.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో డబుల్ స్టాండర్ట్స్ పాటిస్తున్నట్టేం కాదు. బీఆరెస్సే మారిన రాజకీయాలకు అనుగుణంగా మారింది. తమకు రాజకీయంగా లాభమయ్యేలా వ్యవహరించింది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు.. ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటును బీఆరెస్ వివాదం చేయదలుచుకుంటే.. అదే ఇరకాటంలో పడుతుంది.
అందుకే బీజేపీతో పాటు ఏ పార్టీ.. కొత్తగా ఏర్పాటైన కవిత టీఆరెస్ కూడా దీన్ని వ్యతిరేకించదు. ఖండించదు. రానున్నవి జీహెచ్ఎంసీ ఎన్నికలు. ఎవరి రాజకీయ అవసరాలు వారివి. లేటెస్టుగా జరిగిన మహానాడులో మాత్రం తెలంగాణ విషయంలో నోరు జారి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్పై పరోక్షంగా చీప్ కామెంట్స్ చేయడం చంద్రబాబునూ ఇబ్బందిపెట్టింది. రేవంత్ మాత్రం పెద్దగా పట్టించుకున్నట్టు లేదు.