Airtel Plans: టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. ఎంతో ప్రజాధరణ పొందిన నాలుగు చౌకైన ప్లాన్లను ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా తొలగించింది. ప్రస్తుతం రూ. 299, రూ. 579, రూ. 619, రూ. 649 ధరలు గల ప్లాన్లు.. తమ వెబ్సైట్, ఎయిర్టెల్ థాంక్స్ (Airtel Thanks) యాప్ లో కనిపించడం లేదు. దీంతో ఇన్నాళ్లు ఆ ప్లాన్లను రీఛార్జ్ చేసుకుంటున్న బడ్జెట్ యూజర్లకు ఇది ఎదురుదెబ్బే అని టెలికాం నిపుణులు పేర్కొంటున్నారు.
తొలగించిన ప్లాన్లలో రూ. 299 ప్లాన్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ప్లాన్ ఇన్నాళ్లు 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, ఉచిత SMS సేవలను అందిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు దీని స్థానంలో రూ. 349 ప్లాన్ను ఎయిర్టెల్ ముందుకు తెచ్చింది. ఇందులో రోజుకు 2GB డేటా ఇస్తున్నప్పటికీ.. ఇదివరకు రూ. 299 కట్టిన వినియోగదారులు ఇప్పుడు ప్రతి నెలా అదనంగా రూ. 50 (17 శాతం అదనం) చెల్లించాల్సి వస్తోంది. ఎక్కువ డేటా వస్తున్నప్పటికీ.. బడ్జెట్ వినియోగదారులకు ఇది అదనపు భారంగానే మారనుంది.
రూ. 579, రూ. 619, రూ. 649 ప్లాన్లను కూడా ఎయిర్టెల్ రద్దు చేసింది. గత కొద్ది రోజులుగా కొన్ని ప్రాంతాల్లో (Circles) ఈ ప్లాన్లు అందుబాటులో లేకుండా పోగా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దశలవారీగా వీటిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బెనిఫిట్స్ లో ఎలాంటి అప్ గ్రేడ్స్ లేకుండా రూ. 859 ప్లాన్ ధరను రూ. 899కి ఎయిర్ టెల్ పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరికొన్ని ప్లాన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: ప్రీపెయిడ్ vs పోస్ట్పెయిడ్.. రెండింట్లో ఏది బెస్ట్.. దేనివల్ల డబ్బులు మిగులుతాయి!
ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు రూ. 349 పాయింట్నే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. జియో కూడా రూ. 349 ధరకు 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్ ఆందిస్తోంది. అటు వొడాఫోన్ ఐడియా (Vi) సైతం రూ. 349, రూ. 365 ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ సైతం ఇప్పుడు రూ. 349 ప్లాన్ ను కొత్తగా తీసుకురావడం గమనార్హం. కాబట్టి ఎయిర్ టెల్ లో ఇకపై రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ కావలసిన వారు రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ను ఎంచుకోవాల్సిందే. ఎయిర్టెల్లో రూ. 199 బేసిక్ ప్లాన్ ఉన్నప్పటికీ.. అందులో 28 రోజులకు కలిపి కేవలం 2GB డేటా మాత్రమే లభిస్తుంది.
Also Read: 1917 నాటి బాకీ.. బ్రిటిషర్లకు రూ.35 వేలు ఇచ్చిన తాత.. 109 ఏళ్ల తర్వాత రంగంలోకి మనవడు!