Apple Pay India Launch: మన దేశంలో డిజిటల్ చెల్లింపుల వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. చిన్న దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ప్రతీ చోటా ఆన్లైన్ పేమెంట్లే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐఫోన్ వినియోగదారులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న Apple Pay త్వరలోనే భారత్లోకి అడుగుపెట్టబోతోందనే వార్త ఆసక్తి కలిగిస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్లో ఈ సేవలు మన దేశంలో అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్, యాపిల్ వాచ్లు వాడే ప్రతి ఒక్కరికీ ఇది నిజంగా ఒక మంచి వార్త.
Apple Pay అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులను యాపిల్ వాలెట్కు అనుసంధానించుకోవచ్చు. దీంతో ప్రతీసారి కార్డులను బయటకు తీయాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ ఫోన్ లేదా యాపిల్ వాచ్ను స్వైపింగ్ మెషిన్ దగ్గర ఉంచి చెల్లింపులు చేయవచ్చు. అయితే ప్రారంభంలో కేవలం వీసా, మాస్టర్ కార్డ్ నెట్వర్క్లకు చెందిన క్రెడిట్ కార్డులను మాత్రమే ఈ వ్యవస్థ సపోర్ట్ చేసేలా ప్లాన్ చేస్తోంది. దీంతో కార్డుల ద్వారా లావాదేవీలు చేసే వారికి పని చాలా తేలికవుతుంది.
Also Read: అఫీషియల్ లాంచ్ కంటే ముందే లీక్.. Xiaomi 18 Pro, Redmi 17 సిరీస్ రిలీజ్ డేట్స్ ఇవే!
మన దేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్స్ ద్వారా యూపీఐ చెల్లింపులే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఐఫోన్ వినియోగదారులకు ఇక్కడే ఒక చిన్న నిరాశ ఎదురుకానుంది. యాపిల్ పే ప్రారంభ సమయంలో యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. భారతదేశపు డిజిటల్ పేమెంట్ నిబంధనలు చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ సేవలను తేవడానికి కంపెనీకి మరికొంత సమయం పట్టేలా ఉంది. యూపీఐ సేవలు లేకపోవడం వల్ల ప్రారంభంలో చాలామందికి దీని ఉపయోగం కాస్త పరిమితంగానే ఉండవచ్చు.
యూపీఐ సేవలను భారత్లో ఆరంభించాలంటే NPCI నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుంది. అలాగే ఒక స్పాన్సర్ బ్యాంక్ మద్దతు కూడా తప్పనిసరి. అందుకోసమే యాపిల్ సంస్థ ప్రస్తుతం HDFC, ICIC, Axis వంటి దేశీయ ప్రముఖ బ్యాంకులతో విస్తృతంగా చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయి.. అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాతే యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి. ఏది ఏమైనా.. Apple Pay రాకతో భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పోటీ మరింత ఆసక్తికరంగా మారబోతోంది.
Also Read: షాకింగ్.. భారత్లో మళ్లీ పెరిగిన Vivo X300 FE ధర.. ఏకంగా రూ.10,000 పెంపు!