WhatsApp, Telegram, Signal: సోషల్ మీడియా యాప్లలో యూజర్ల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్కు నోటీసులు పంపిన మరుసటి రోజే.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మరో రెండు ప్రముఖ యాప్లైన టెలిగ్రామ్, సిగ్నల్కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ యాప్లలో ఉన్న ‘యూజర్నేమ్’ ఫీచర్పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
సాధారణంగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్లలో అవతలి వ్యక్తికి మన ఫోన్ నెంబర్ కనిపించకుండా, కేవలం ఒక ‘యూజర్నేమ్’ క్రియేట్ చేసుకుని మాట్లాడుకునే సదుపాయం ఉంది. అయితే ఈ ఫీచర్ వల్ల మోసాలు, ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే (ఇంపర్సనేషన్) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ ఫీచర్ను ఎందుకు అనుమతించాలో చెప్పాలని, అలాగే దీని ద్వారా జరిగే మోసాలను ఎలా అరికడుతున్నారో వివరించాలని కేంద్రం ఈ నోటీసుల్లో ప్రశ్నించింది.
ఇదే తరహా ‘యూజర్నేమ్’ ఫీచర్ను తీసుకురావడానికి వాట్సప్ ప్రయత్నించగా.. కేంద్ర ప్రభుత్వం దానికి బ్రేక్ వేసింది. ఈ ఫీచర్ వల్ల ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి ప్రజలను మోసం చేసే ప్రమాదం ఉందని ఐటీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరణ ఇచ్చేంతవరకు ఈ ఫీచర్ను రోల్ అవుట్ చేయవద్దని వాట్సప్ను ఆదేశించింది.
Read Also: టీవీలు, లాప్టాప్లపై 80% వరకు తగ్గింపు.. రోజుకు రూ.99కే హోమ్ అప్లయెన్సెస్!
ప్రభుత్వ నోటీసులపై స్పందించిన వాట్సప్.. తమ ప్లాట్ఫామ్పై మోసాలను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. యూజర్నేమ్ ఫీచర్ ఉన్నప్పటికీ లాగిన్ అవ్వడానికి ఫోన్ నెంబర్ తప్పనిసరని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్లను గుర్తించేలా కొత్త అకౌంట్, మ్యూచువల్ గ్రూప్ సభ్యులా అనే వివరాలను చూపిస్తామని వెల్లడించింది.
టెలిగ్రామ్ యాప్ గత కొంతకాలంగా భారత ప్రభుత్వ నిఘాలో ఉంది. ఇటీవల నీట్ (NEET) పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ యాప్పై వారం రోజుల పాటు నిషేధం కూడా విధించారు. జూన్ 22న ఈ నిషేధం ముగిసిన తర్వాత సేవలు పునరుద్ధరించబడ్డాయి. ఇప్పుడు తాజాగా యూజర్నేమ్ వివాదంపై కేంద్రం ఐటీ చట్టాల ప్రకారం ఈ నోటీసులు జారీ చేయడంతో ఈ యాప్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: చేతిలోనే మినీ థియేటర్.. 9 స్పీకర్లు, 10,200mAh బ్యాటరీతో Lenovo కొత్త ట్యాబ్ వచ్చేసింది!