Ice Battery: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రముఖ మాన్హాటన్ ఆఫీసు భవనం (Manhattan Building) వేసవి కాలంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. సాధారణంగా పగటిపూట తీవ్రమైన ఎండల సమయంలో ఏసీల వాడకం వల్ల విద్యుత్ గ్రిడ్పై భారీగా భారం పడుతుంది. దీనికి పరిష్కారంగా ఈ భవనంలో రాత్రి వేళల్లోనే భారీ ఎత్తున నీటిని గడ్డకట్టించి మంచుగా మారుస్తున్నారు. ఆ తర్వాత పగటిపూట ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు రాత్రి నిల్వ చేసిన ఈ మంచును కరిగిస్తూ భవనం మొత్తాన్ని చల్లబరుస్తున్నారు.
సాధారణంగా రాత్రి సమయాల్లో విద్యుత్ వాడకం తక్కువగా ఉండటం వల్ల అమెరికాలో విద్యుత్ ఛార్జీలు (టారిఫ్లు) చాలా చౌకగా ఉంటాయి. అదే పగటిపూట.. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో గృహాలు, వాణిజ్య సముదాయాలన్నీ ఒకేసారి ఏసీలు వాడటం వల్ల విద్యుత్కు డిమాండ్ విపరీతంగా పెరిగి ఛార్జీలు కూడా గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సదరు భవనం రాత్రివేళ చౌకగా లభించే విద్యుత్తో మంచును తయారుచేస్తోంది. దీనివల్ల పగటిపూట ఏసీల కోసం ప్రధాన విద్యుత్ గ్రిడ్పై ఆధారపడాల్సిన అవసరాన్ని తప్పించుకొని.. విద్యుత్ బిల్లులను భారీగా తగ్గించుకుంటోంది.
రాత్రివేళ నీటిని గడ్డకట్టించి పగలు దాని ద్వారా కూలింగ్ పొందే విధానాన్ని సాంకేతిక భాషలో ‘ఐస్ బ్యాటరీ’గా అభివర్ణిస్తున్నారు. సాధారణ బ్యాటరీలు విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుంటే.. ఈ ఐస్ బ్యాటరీలు రాత్రిపూట ‘చల్లదనాన్ని’ మంచు రూపంలో నిల్వ చేసుకుంటాయి. భవన భూగర్భంలో ఉండే ప్రత్యేక వ్యవస్థలు రాత్రికి రాత్రే వేలాది లీటర్ల నీటిని మంచుగా మారుస్తున్నాయి. అనంతరం పగటిపూట భవనంలోని కూలింగ్ వ్యవస్థ దీని ఆధారంగా ఆఫీసును చల్లబరుస్తోంది.
Also Read: గోల్కొండలో ‘రహస్య సొరంగం’.. ఆర్మీ సీక్రెట్ తవ్వకాలు.. రంగంలోకి ఆర్కియాలజీ నిపుణులు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతుండటంతో ఏసీల వాడకం పెరిగి విద్యుత్ గ్రిడ్లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా నగరాల్లో పగటిపూట డిమాండ్ తట్టుకోలేక విద్యుత్ సరఫరా నిలిపేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాన్హాటన్ భవనం అమలు చేస్తున్న ఐస్ బ్యాటరీ మోడల్ పర్యావరణహితమైనదిగా, ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరమైనదిగా నిలుస్తోంది. భవిష్యత్తులో మిగిలిన వాణిజ్య భవనాలు కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఇంధన సంక్షోభాన్ని చాలావరకు నివారించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?