Mijia Smart Fish Tank 2 Pro: ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షావోమీ.. మరో వినూత్న పరికరాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. చేపల పెంపకం, వాటి నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ‘మిజియా స్మార్ట్ ఫిష్ ట్యాంక్ 2 ప్రో’ (Mijia Smart Fish Tank 2 Pro) పేరుతో ఒక అత్యాధునిక అక్వేరియంను ఆవిష్కరించింది. ఆటోమేటిక్ ఫీడర్, కలర్ డిస్ప్లే, ప్రత్యేకమైన వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్తో వస్తున్న ఈ ట్యాంక్.. ఆక్వా ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ అక్వేరియంకు సంబంధించిన ప్రధాన ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ స్మార్ట్ ఫిష్ ట్యాంక్లో నీటిని నిరంతరం శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన ‘మల్టీ లేయర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్’ను అమర్చారు. ఇందులో నీరు క్రమపద్ధతిలో వివిధ పొరల గుండా ప్రవహించడం ద్వారా వ్యర్థాలు తొలగిస్తుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు దీనిలోని ‘U’ ఆకారపు బయో ఫిల్టర్ కార్ట్రిడ్జ్.. మంచి బ్యాక్టీరియా వృద్ధిని పెంచి నీటిని ఎక్కువ కాలం స్వచ్ఛంగా ఉంచేందుకు సాయపడనుంది. అలాగే దీనిలోని శక్తివంతమైన మోటార్.. తక్కువ విద్యుత్ వినియోగంతో మెరుగైన నీటి ప్రవాహాన్ని చేపలకు అందించనుంది.
ఈ స్మార్ట్ ట్యాంక్ ముందు భాగంలో 1.47 అంగుళాల కలర్ LCD స్క్రీన్ను అమర్చారు. దీని ద్వారా నీటి ఉష్ణోగ్రత, అక్వేరియం స్థితిగతులు, ఏవైనా వార్నింగ్స్ ఉన్నాయా అనేది వెంటనే స్క్రీన్ పై తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ‘Mi Home’ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పంప్ వేగాన్ని నియంత్రించవచ్చు. అలాగే ఉష్ణోగ్రతను కూడా పర్యవేక్షించవచ్చు. ట్యాంక్ మూత తెరిస్తే ఆటోమేటిగ్గా వాటర్ పంప్ ఆగిపోయేలా దీన్ని డిజైన్ చేశారు. ‘షావో ఐ’ వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా దీనిని ఆపరేట్ చేయవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ట్యాంక్లో ఆటోమేటిక్ ఫీడర్ ను అందించారు. ఇది మ్యాన్యువల్, స్మార్ట్ మోడ్లలో పనిచేస్తుంది. ఊరెళ్లినప్పుడు, బిజీగా ఉన్నప్పుడు ముందుగా సెట్ చేసిన సమయానికి ఇది చేపలకు ఆహారం అందిస్తుంది. మరోవైపు ఇందులో అత్యంత నాణ్యమైన అల్ట్రా-క్లియర్ గ్లాస్ ను అందించారు. అలాగే చేపలు బయటకు దూకకుండా యాంటీ-జంప్ లిడ్, పొగమంచు పట్టకుండా సైడ్ వెంటిలేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఒకవేళ ఇంట్లో కరెంట్ పోయినా కూడా USB పవర్ బ్యాంక్ ద్వారా దీనిని రన్ చేయవచ్చు.
Also Read: ఇతనేం సీఎం అయ్యా.. పొద్దున్నే 4 గంటలకు లేపేస్తున్నాడు.. విజయ్ రూటే సెపరేటు!
షావోమీ ప్రస్తుతం దీనిని చైనా మార్కెట్లలో లాంచ్ చేసింది. దీని ప్రీ-ఆర్డర్లు అక్కడ ప్రారంభమయ్యాయి. క్రౌడ్ ఫండింగ్ ఆఫర్ కింద దీనిని 599 యువాన్లకు (సుమారు రూ. 8,502) అందిస్తుండగా.. అసలు ధర 699 యువాన్లు (దాదాపు రూ.9,922)గా నిర్ణయించారు. ఆగస్టు 24 నుంచి చైనాలో అధికారికంగా దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే భారత్ సహా.. ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ అక్వేరియంను తీసుకొని రావాలని షావోమీ కసరత్తు చేస్తోంది.
Also Read: విద్యార్థులపై దాడి వ్యవహారం.. సుప్రీం సంచలన నిర్ణయం.. విచారణకు హైపవర్ కమిటీ!