Ponguleti Srinivas: “బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేసే తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. తనపై ఏదైన ఆరోపణ చేస్తే ప్రజల ముందు ఆధారాలతో మాట్లాడాలన్నారు. ఫీనిక్స్, రాఘవ తదితర సంస్థలతో వ్యాపార రంగంలో లావాదేవీలు జరగడం సహజమేనని, వాటిని పట్టుకొని రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి చెప్పారు. తాను రెండు దశాబ్ధాలుగా వ్యాపార రంగంలో ఉన్నానని, తాను అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానని, ఒక్క రోజులో వేల కోట్లకు ఎదిగిన వ్యక్తిని కాదన్నారు.
తన వ్యాపార ప్రస్థానం, నేపథ్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునని చెప్పారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు పెట్టుకోవాలని, పిచ్చి కూతలు బంద్ చేయాలని మంత్రి మండిపడ్డారు. మంగళవారం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోదని వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామన్నారు. 22 ఏ పరిధిలోని భూములకు 24 గంటల్లోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 మొత్తం 34 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్లైన్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందని తెలిపారు. వివిధ జీవోలు, మెమోల ద్వారా గత ప్రభుత్వాల కాలంలో క్రమబద్ధీకరించబడిన ప్రైవేట్ భూములు, హైకోర్టు జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు ఆన్లైన్ అప్లోడింగ్లో సాంకేతిక లోపం కారణంగా 22ఏ జాబితాలోకి వచ్చాయని మంత్రి వివరించారు.ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించిందని, బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని తెలిపారు.
Also Read: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
22ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ,స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ,ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి ,జెన్యూన్ ప్రైవేట్ ఆస్తులన్నింటినీ తక్షణమే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు
గత ప్రభుత్వంలో ధరణి చేసిన పాపం అంతా ఇంతా కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వంలో తన శాఖ పరిధిలో అధికారులు చేసిన మిస్టేక్ ను ఆ శాఖ బాస్ గా తాను బాధ్యత తీసుకున్నానని, అందుకే సారీ చెప్పినట్లు మంత్రి వివరించారు. ఇదే తరహాలో ధరణి తప్పిదాలు, నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీష్ రావు బాధ్యత తీసుకోవాలని మంత్రి సవాల్ విసిరారు.
అంతేక కాళేశ్వరం విషయంలోనూ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. “విమర్శలు చేయడం చాలా సులువు.. కానీ బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదు. 22ఏ విషయంలో పొరపాటు జరిగిందని మేము బహిరంగంగా అంగీకరించాం.. ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నాం. వారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన తప్పులకు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? కనీసం క్షమాపణ చెప్పారా?” మంత్రి అని ప్రశ్నించారు.పదేళ్లు అధికారంలో ఉన్న హరీశ్ రావుకు ఇప్పటికీ 30 శాతం కమిషన్లు ఎందుకు గుర్తుకొస్తున్నాయో ప్రజలకు తెలుసునని మంత్రి చురకలు అంటించారు.
Also Read: పెళ్లికి ముందు జరగాల్సినవి ముందే అయిపోతున్నాయి–శాంతి స్వరూప్ వైరల్ కామెంట్స్