Shoaib Akhtar On Pakistan Team: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ టెస్టు సిరీస్ లో భాగంగా లీడ్స్ వేదికగా ఆగస్టు 19వ తేదీన మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. కెప్టెన్ బాబర్ ఆజం అందుబాటులో లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ లో 171 పరుగులకు ఆల్ అవుట్ అయిన పాకిస్తాన్, రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటికే 59 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. మరో నాలుగు లేదా ఐదు గంటల్లో అలౌట్ అయ్యే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ షో చూపిస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రదర్శన పై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టును చూస్తే అసహ్యం వేస్తోందని బాంబు పేల్చారు. ఒక్కడుంటే ఒక్కడు సరిగ్గా ఆడడం లేదని మండిపడ్డారు. ఇంగ్లాండ్ గడ్డపై వాళ్ల బౌలింగ్ దళాన్ని చూసి పాకిస్తాన్ ప్లేయర్లు ప్యాంట్లు తడుపుకుంటున్నారని హేళన చేశారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ తన టెస్ట్ హోదాను కోల్పోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. అసలు ప్రత్యర్ధికి ఏ మాత్రం పోటీ ఇవ్వడంలేదని సీరియస్ అయ్యారు. డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ క్రికెటర్లు తన్నుకోవడం తప్ప.. ప్రత్యర్థిని ఎలా కొట్టాలనే దానిపైన దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కంటే ఉగాండా బెటర్ అని తనకు అనిపిస్తోందని పరువు తీసారు షోయబ్ అక్తర్. దీంతో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపించడం లేదన్నారు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. ఒకవేళ మూడు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ అయిన పాకిస్తాన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని కూడా శపథం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో బాబర్ ఆజం కాదు ఆ అల్లా దిగివచ్చిన కూడా పాకిస్తాన్ జట్టును కాపాడడం కష్టమేనన్నారు. పాకిస్తాన్ జట్టులో గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టును ఓడించడం కంటే… తన్నుకోవడం పై పాక్ ప్లేయర్లు దృష్టి పెడుతున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ స్పెషల్ ఫోకస్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.