Bhupalpally Tragedy: ప్రపంచ కవలల దినోత్సవం రోజు విషాద ఘటన జరిగింది. కవలల దినోత్సవం సందర్భంగా కవలలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న పరిస్థితుల్లో, కవలలు మృతి చెందడం విషాదాన్ని నింపింది. అది కూడా 4 నెలల వయస్సు గల చిన్నారి కవలలు మృతి చెందడంతో ఈ విషయం వైరల్ గా మారింది. డబ్బా పాలు త్రాగుతూ.. కవలలు మృతి చెందిన ఘటన తెలుసుకున్న అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో జరిగింది.
ఫిబ్రవరి 22వ తేదీన ప్రపంచ కవలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తమకు సంతానంగా కవలలు జన్మించడంతో వారి తల్లిదండ్రులు పడ్డ ఆనందం, కవలల దినోత్సవం రోజు కొద్ది క్షణాలు కూడా ఉండని పరిస్థితి. అసలేం జరిగిందంటే.. గణపురం మండలం గొల్లపల్లి కి చెందిన మర్రి అశోక్, లాస్య దంపతులకు కవల పిల్లలు. వీరి వయసు 4 నెలలు. అయితే నగరంపల్లి స్వగ్రామం కావడంతో లాస్య తన పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటున్నారు. రోజువారి మారిగానే లాస్య తన పిల్లలకు డబ్బా పాలు తాపేందుకు అంతా సిద్ధం చేసి, పిల్లలకు డబ్బా పాలు అందించింది. కొద్ది క్షణాల్లో ఇరువురు చిన్నారులు నిద్రలోకి జారుకోగా, ఇంటి పనిని పూర్తి చేసేందుకు లాస్య వెళ్లింది.
లాస్య వెళ్ళిన కొద్ది క్షణాలకే ఇద్దరు చిన్నారుల ముక్కులో నుండి పాలు కారుతున్న విషయాన్ని ఆమె గమనించింది. పిల్లలను నిద్రలేపేందుకు కదిలించినా.. ఏమాత్రం కదిలిక లేని పరిస్థితి. చిన్నారులు స్పృహ కోల్పోయినట్లు భావించిన లాస్య వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. హుటాహుటిన ఇద్దరు చిన్నారులను భూపాలపల్లి వైద్యశాలకు తరలించగా, అప్పటికే కవలలు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాలుగు నెలలు కవల పిల్లలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముుకున్నాయి.
ప్రపంచ కవలల దినోత్సవం రోజున, తమకు కవలలు పుట్టారని ఆనందించిన ఆ దంపతులకు అదే రోజు విషాదం మిగిల్చిందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకుని పిల్లలకు పాలు తాగించిన పాల పౌడర్ డబ్బా ను సీజ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాల పౌడర్ శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు సమాచారం. మొత్తం మీద 4 నెలల వయస్సు గల చిన్నారులు మృతి చెందడంతో, వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Also Read: Hyderabad Crime: కన్నతండ్రిని నడిరోడ్డుపై హత్య చేసిన కుమారుడు.. ఏకంగా 15 కత్తిపోట్లు..
పాల పౌడర్ డబ్బాను ఎక్కడ కొనుగోలు చేశారు? అవే డబ్బాలు ఎంత మందికి విక్రయించారు? కొనుగోలు చేసిన వారు, వాటిని వినియోగించారా? అనే ప్రశ్నలకు సమాధానం పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. అలాగే చిన్నారుల మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కావాల్సి ఉంది. జిల్లా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, అసలు విషయాన్ని ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.