Bhu Bharati Portal: రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించేందుకు భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భూభారతి అమలుపై రివ్యూ నిర్వహించారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని, పోర్టల్ను ప్రజలకు అంకితం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో రైతుల భూముల పరిరక్షణ బాధ్యత ఈ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి పొంగులేటి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని తామిచ్చిన హామీని విశ్వసించి ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారన్నారు. భూ భారతి చట్టాన్ని తీసుకురావడం.. ఇందులో రెవెన్యూశాఖ మంత్రిగా తనకు భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినందుకు తన జన్మ ధన్యమైందన్నారు మంత్రి పొంగులేటి.
రాష్ట్రంలో తొలుత మూడు జిల్లాలలోని మూడు మండలాలలో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేయబోతుంది ప్రభుత్వం. ఈ మూడు మండలాలలో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్ధాయిలో అమలు చేయనున్నారు.
2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం తమకు రిఫరెండమని గతంలో శాసనసభలోనే ప్రకటించడం జరిగిందన్నారు మంత్రి పొంగులేటి. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ తయారు చేసినట్లు చెప్పారు. 2020 చట్టంలో సాదాబైనామాల అంశం లేదన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపిస్తామంటేనే కాంగ్రెస్ను గెలిపించారని గుర్తు చేశారు పొంగులేటి. 12 లక్షల ఎకరాలను పార్ట్-Bలో క్లియర్ చేయబోతున్నామని వివరించారు భూములపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఒక భరోసా, భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించామన్నారు. భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని తెలిపారు.
భూ యజమానులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్ను సందర్శించవద్దని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. దీనివలన మొత్తం పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేగాక కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్ను ఆగిపోయేలా చేయాలని ప్రయత్నిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు.
Also Read: భూ భారతి పోర్టల్ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్.. పైలట్ ప్రాజెక్ట్గా 3 మండలాల్లో..
గతంలో ధరణిని తీసుకువచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని.. ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండా క్రమక్రమంగా పోర్టల్ను అభివృద్ది చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం, పోర్టల్ అమలుకు సంబంధించి ఎంపిక చేసిన ప్రయోగాత్మక గ్రామాలలో స్వయంగా తాను పర్యటిస్తానన్నారు పొంగులేటి. భూభారతిలో ఎమ్మార్వో స్ధాయి నుంచి సిసిఎల్ వరకు సుమారు ఐదు స్ధాయిలలో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీకరణ చేశామన్నారు. అంతేగాక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాం. తర్వాత కాలంలో సమస్యలు తగ్గితే ట్రిబ్యునల్స్ను కుదిస్తామన్నారు. ధరణిలో గతంలో ఉండే 33 మాడ్యూల్స్ను ఆరు మాడ్యూల్స్కు తగ్గించామని దీనివలస అందరికీ ఈ పోర్టల్ సులభతరంగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి.