Formula E Race Case: హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కేసు విచారణ ఎంత వరకు వచ్చింది? మొత్తం ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారా? చాలా ప్రశ్నలకు తెలీదని ఎందుకన్నారు? విచారణ తర్వాత కేటీఆర్ బయటకు రావడంతో ఈ కేసు నిజమేనని తెలంగాణ సమాజం నమ్మిందా? రాజకీయ కక్షకాదని తేలిపోయిందా? మళ్లీ సంక్రాంతి తర్వాత విచారణ కొనసాగనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఫార్ములా ఈ రేసు కేసులో తొలి అంకం ముగిసింది. మరో అంకానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అధికారులు, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను పోల్చి చూస్తున్నారు. ప్రభుత్వం దగ్గర తీసుకున్న డాక్యుమెంట్స్తో సమాధానాలను కంపేర్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ప్రశ్నలు సమాధానాలు సరిగా లేవని అంటున్నారు. సంక్రాంతి తర్వాత మరోసారి పిలవచ్చని అంటున్నారు అధికారులు.
ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదటి నుంచి బురద జల్లే ప్రయత్నం చేశారు కేటీఆర్. రాజకీయ కక్ష కారణంగా తనపై కేసు నమోదు చేశారంటూ పదేపదే మీడియా ముందు చెప్పుకొచ్చారు. అలాంటి రివేంజ్ గనుక ఉంటే గురువారం విచారణ తర్వాత కేటీఆర్ను అధికారులు అరెస్ట్ చేసేవారు. చివరకు రాజకీయ కక్ష కాదని తేలిపోయింది.
గురువారం విచారణ విషయానికొద్దాం. విచారణ మొదలైనప్పటి నుంచీ బయటకు వచ్చేవరకు కేటీఆర్ కొంత టెన్షన్గా కనిపించారు. చెమటలు పట్టడంతో పలుమార్లు అధికారులు రెస్ట్ ఇచ్చారు. లంచ్ టైమ్ తర్వాత ప్రశ్నలు అడిగినా ముభావం గానే ఉన్నారట. విచారణ ముగిసిన తర్వాత మీరు వెళ్లిపోవచ్చని చెప్పడంతో కేటీఆర్ ముఖంలో కాస్త ఆనందం కనిపించిందని అంటున్నారు. మంచినీళ్లు తాగి ఏసీబీ ఆఫీసు నుంచి బయటకువచ్చారాయన.
ALSO READ: హైదరాబాద్కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?
తొలిరోజు విచారణలో ఐఏఎస్ అధికారులు దాన కిషోర్, అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు కేటీఆర్కు సంధించారు. అందులో కొన్ని ప్రశ్నలకు తెలీదని సమాధానం ఇచ్చారట. ఫార్ములా ఈ రేసు ఒప్పందం ఎలా జరిగింది? ఇలాంటి క్రీడల్లో అనుభవం లేకపోయినా ఆ కంపెనీని ఎందుకు నియమించారు? స్పాన్సర్గా గ్రీన్ కో కంపెనీకి చెందిన ఏస్ నెక్ట్స్ జెన్ను ఎందుకు ఎంపిక చేశారు?
ఈ విషయంలో టెండర్లకు వెళ్లకుండా ఆ కంపెనీకి ఎలా కట్టబెట్టారు? గ్రీన్ కో కంపెనీ అధిపతికి-మీకున్న రిలేషన్ ఏంటి? స్పాన్సర్ తప్పుకున్నట్లు మీకు ఎలాగ తెలుసు? ఒప్పందం ప్రకారం స్పాన్సర్ తప్పుకుంటే ఆయనపై చట్టపరమైన చర్యలకు ఎందుకు వెళ్లలేదు? దేనికీ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.
పురపాలక శాఖ-ఎఫ్ఈవో మధ్య ఒప్పందం జరిగితే ఆ శాఖ నుంచి నిధులివ్వాలని, కానీ హెచ్ఎండీఏ నుంచి ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు? కొన్నింటికి తనకు తెలీదు అనే సమాధానం ఇచ్చారట కేటీఆర్. సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘన గురించి ప్రశ్నించారట అధికారులు. అదంతా కార్యదర్శి పరిధిలోని అంశమని చెప్పారట.
కోడ్ విషయంలో నిధులపై ప్రశ్నించినప్పుడు, ఈసీ తమకు ఎలాంటి లేఖ రాయలేదని బదులిచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఏసీబీ విచారణలో చాలా ప్రశ్నలకు తెలీదు అనే సమాధానం ఇచ్చారట కేటీఆర్. సంక్రాంతి తర్వాత కేటీఆర్ను మరోసారి విచారించనుంది ఏసీబీ. ఆ తర్వాత ఈడీ ముందుకు రానున్నారు. అరెస్టులు ఏమైనా ఉంటే అప్పుడే ఉండవచ్చని అంటున్నారు.