Ramana Reddy: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలంటే ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన డిసిసి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు
ఇటీవల పార్టీ నియమించిన నూతన డివిజన్ అధ్యక్షులు గారిసెల సురేందర్, నడికోపు నాగరాజు, రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పిసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆదేశాలను అనుసరిస్తూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన డివిజన్ అధ్యక్షులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. పార్టీ పదవుల కోసం ప్రయత్నించిన ఆశావహులు నిరుత్సాహానికి గురికాకుండా పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం అదే ఉత్సాహంతో పనిచేయాలని రమణారెడ్డి సూచించారు.
డివిజన్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం
వ్యక్తిగత విభేదాలు, గ్రూపు రాజకీయాలు పార్టీకి మాత్రమే కాకుండా నాయకుల రాజకీయ భవిష్యత్తుకూ నష్టం కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించిన ఇద్దరు నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన వారేనని, వారు సర్పంచ్లుగా కూడా సేవలందించారని గుర్తు చేశారు. అందువల్ల ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే భేదాభిప్రాయాలకు తావులేకుండా పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
Also Read: 26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!
ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలి..
అలాగే నాయకత్వం ఇచ్చే మార్గదర్శకాలను పాటిస్తూ రానున్న లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చివరగా, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలను ముందుంచుకుని ప్రతి నాయకుడు, కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని గోమారం రమణారెడ్డి పేర్కొన్నారు.