Harish Rao: తెలంగాణ ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సుదర్శన్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్న ఆయన, దివంగత నేత చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమ రోజుల్లో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
అమరవీరుల స్థూపం వద్ద ఘర్షణ.. ప్రాణాలు కాపాడిన క్షణాలు
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జరిగిన ఒక కీలక సంఘటనను హరీష్ రావు ఈ సందర్భంగా సభలో పంచుకున్నారు. ‘ఒక ఉద్యమకారుడు అమరుడైతే ఆయన అంతిమ యాత్రను డీసీఎం వాహనంపై నిర్వహిస్తున్నాం. వరంగల్లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకోగానే పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ తోపులాటలో నేను డీసీఎం పైనుంచి కిందపడిపోయాను. సరిగ్గా అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి నన్ను తన చేతుల్లోకి పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ రోజు నేరుగా నేలపై పడి ఉంటే తీవ్ర గాయాలయ్యేవి’ అని గుర్తు చేసుకున్నారు.
Also Read: మంత్రి పొంగులేటి స్పీచ్.. అడ్డుకున్న పాడి కౌశిక్ రెడ్డి
కాలం చేసిన విచిత్రం.. ఆసుపత్రి జ్ఞాపకాలు
ప్రమాదం జరిగిన వెంటనే సుదర్శన్ రెడ్డి తనను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారని హరీష్ రావు తెలిపారు. ‘మొన్న సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరారని తెలియగానే నేను, కేటీఆర్ హుటాహుటిన పరుగెత్తుకుంటూ వెళ్లాం. తీరా అక్కడకు వెళ్లాక నాకు ఆనాటి సంఘటన గుర్తుకొచ్చింది. ఏ ఆసుపత్రి కైతే ఆ రోజు నన్ను కాపాడి సుదర్శన్ రెడ్డి తీసుకెళ్లాడో, అదే ఆసుపత్రిలో ఆయనను చివరి చూపు చూస్తానని కలనైనా ఊహించలేదు’ అని చెబుతూ హరీష్ రావు కలవరపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి చూపిన చొరవ, ధైర్యం ఎప్పటికీ మరచిపోలేనని ఆయన నివాళి అర్పించారు.