Ponnam Prabhakar: కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ సమావేశం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హుజురాబాద్ మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ రోంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి , కౌన్సిలర్ల పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తాలో నివాళులర్పించి, భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత ప్రజల అభివృద్ధియే లక్ష్యమని స్పష్టం చేశారు. హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, చైర్మన్ కోరిన రూ. 300 కోట్ల నిధుల ప్రతిపాదనలను పరిశీలించి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అదే విధంగా.. మార్చి 6 నుండి జూన్ 12 వరకు ఈ ప్రణాళిక అమలులో ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ఈ-వ్యర్థాల సేకరణ, ప్లాస్టిక్ రహిత సమాజం, మొక్కలు నాటడం ,పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై దృష్టి సారించాలని అధికారులను, మహిళా సంఘాలను కోరారు.
డ్రగ్స్ , గంజాయికి దూరంగా ఉండాలని. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచి, విద్యార్థులకు శారీరక దృఢత్వం కోసం ఆటపాటలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూనే, ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడే హుజురాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడిందని గుర్తు చేస్తూ.. ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ తదితర నేతలు పాల్గొన్నారు.
Also Read: ప్రేమించిన పాపానికి ‘కోమా’లోకి.. ఆనందపురంలో అర్థరాత్రి ఏం జరిగింది?