IIIT Student: ఐటీ హబ్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. తోటి విద్యార్థులు కళ్లముందే ఈ ఘోరం జరగడంతో క్యాంపస్లో ఒక్కసారిగా భయాందోళనలు, విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు.
6వ అంతస్తు నుంచి దూకి..
పోలీసులు వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్ గచ్చిబౌలి IIITలో చదువుతున్నాడు. శనివారం ఆయన క్యాంపస్లోని బిల్డింగ్ 6వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన అభిరూప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యకు గల కారణాలు
అభిరూప్ ఈ విపరీత నిర్ణయం తీసుకోవడానికి గల పూర్తి కారణాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే, గత కొంతకాలంగా అతను తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ మానసిక ఒత్తిడి భరించలేకనే బిల్డింగ్ పైనుంచి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Also Read: మధ్యప్రదేశ్లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!
కేసు నమోదు చేసి దర్యాప్తు
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఫోన్ కాల్ డేటాతో పాటు, క్యాంపస్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. అభిరూప్ మరణవార్తను ఖమ్మంలోని ఆయన కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.