Fish Deaths: స్వేచ్ఛ: మూడు చింతల పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు పెద్ద చెరువులో భారీగా చేప పిల్లలు మృతి చెందడం కలకలం రేపుతోంది. చెరువుకు సమీపంలోని ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు నీటిలో కలవడం వల్లే చేప పిల్లలు మృత్యువాత పడ్డాయని స్థానికులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.చెరువులో సుమారు 15 లక్షల చేప పిల్లలు మృతి చెందినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో చేప పిల్లలు మృతి చెందడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఫిర్యాదు..
గతంలోనే ఫిర్యాదుచెరువు నీటి కాలుష్యంపై గత ఏడాదే కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అప్పట్లోనే అధికారులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నమూనాలు సేకరించి పరీక్షించాలి
చేప పిల్లల మృతికి అసలు కారణమేంటో తేల్చేందుకు అధికారులు వెంటనే చెరువు నీరు, మృతిచెందిన చేపల నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఫార్మా పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు చెరువులోకి చేరాయా? లేదా ఇతర కారణాలతో చేపలు మృతి చెందాయా? అన్నది సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.మత్స్యకారుల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించాలని, చెరువు కాలుష్యానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు, గ్రామస్థులు కోరుతున్నారు.
Also Read: బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే మ్యాచ్.. అసెంబ్లీ తీరుపై వైఎస్ జగన్ సెటైర్లు!