KTR: స్వేచ్ఛ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రాజకీయంగా వేడి పుట్టించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కార్యకర్తల్లో జోష్ నింపుతూ, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్కు పాతర.. కేసీఆర్ మళ్లీ రావడం పక్కా
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. మహేశ్వరంలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం, సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించడం ఖాయమన్నారు. తెలంగాణ నలుదిశలా ఇప్పుడు ‘కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె’ అనే నినాదమే మారుమోగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడి, కేవలం విధ్వంసం, విషాదమే మిగిలాయని మండిపడ్డారు. కేసీఆర్ కిట్, రైతుబంధు వంటి పథకాలకు పాతర వేసి, కరెంటు కోతలను తీసుకొచ్చారని విమర్శించారు.
420 అబద్ధాలతో గద్దెనెక్కిన ‘హిట్లర్ రెడ్డి’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాధారణంగా ఎవరైనా అంబేద్కర్, శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్, రావణాసురుడిని ఆదర్శంగా తీసుకుంటున్నారని, అందుకే ఆయన పేరు ఇక నుంచి ‘హిట్లర్ రెడ్డి’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు రజనీకాంత్ రేంజ్ డైలాగులతో, భట్టి విక్రమార్క కమల్ హాసన్ కంటే ఎక్కువ నటనతో 420 అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుబంధు పెంచుతామని చెప్ప.. ఇప్పుడు కనీసం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. వంద రోజుల గ్యారెంటీ కార్డు రెండున్నరేళ్లయినా దేనికీ పనికిరాకుండా పోయిందని విమర్శించారు.
Also Read: హైదరాబాద్లో భారీ భూ కుంభకోణం.. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన లేఖ!
ఢిల్లీకి మూటలు.. ఫ్యూచర్ సిటీ పేరిట దందా
కేసీఆర్ పదేళ్లలో చేసిన అప్పులతో గురుకులాలు, మెడికల్ కాలేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, ఢిల్లీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డ ‘రెన్యూవల్ సీఎం’ అని, అందుకే 30 నెలల్లో 72 సార్లు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ తెలంగాణ సొమ్మును అక్కడికి తరలిస్తున్నారని ఆరోపించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున ఐదేళ్లకు ఇవ్వాల్సిన రూ.1.50 లక్షలు ఇస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఫార్మా సిటీని రద్దు చేసి, ఫ్యూచర్ సిటీ పేరిట భూములను దోచుకుంటూ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని మండిపడ్డారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం
రాబోయే ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వ నమోదు (SIR) కార్యక్రమాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని, బూత్ స్థాయిలో కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కితే బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.