KTR: నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ వరంగల్లో ఎంతో భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర విచారానికి లోనయ్యారు. ప్రజా ప్రయోజనాలే ఊపిరిగా జీవించిన ఒక నిజమైన ప్రజా నాయకుడిని కోల్పోవడం ప్రాంతానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధికి గుర్తుగా మెడికల్ కాలేజీకి పేరు
నర్సంపేట ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సదుపాయాలు అందించాలని పెద్ది పడరాని తాపత్రయం పడ్డారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఏ మెడికల్ కాలేజీ సాధన కోసం పెద్ది అనుక్షణం పరితపించారో, రాబోయే రోజుల్లో ఆ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే పెడతాం’ అని హామీ ఇచ్చారు. నర్సంపేట చరిత్ర ఉన్నంత కాలం, ఈ నేల మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా బాధ్యత తీసుకుంటామన్నారు.
అండగా పార్టీ..
పెద్ది సుదర్శన్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడే కాదని, సమాజ శ్రేయస్సు కోరే గొప్ప అభ్యుదయ వాది అని కేటీఆర్ కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, అయితే ఆయన కుటుంబాన్ని పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు, కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి..
రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతాయని, పెద్ది ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని సభలో పేర్కొన్నారు.
Also Read: మా బాధను రాజకీయం చేయొద్దు.. దండం పెడతా! మెడికో ప్రియాంక తండ్రి